కాసె సర్వప్ప కన్నా పూర్వం 16వశతాబ్దంలో ఏకామ్రనాథుడు ‘ప్రతాప చరిత్ర’ అనే చారిత్రక కావ్యాన్ని రచించాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి వచన కావ్యం. తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు వచన కావ్యం ఇదే.
ఈ రచనలో కాకతీయ రాజుల చరిత్ర ఉన్నది. కొన్ని చారిత్రక అసత్యాలను చెప్పినా.. ఏకామ్రనాథుని వచన రచన ఆనాటి రాజకీయ వ్యవహార వచన రచనకు
నిదర్శనంగా నిలిచి ఉంది. అందుకే ఈ రచనకు ప్రాధాన్యం. ఆ తర్వాత కాలంలో దక్షిణాంధ్ర యుగంలో రాయబడిన ‘రాయ వాచకం’లో ఇదే శైలి కనిపిస్తున్నది.
అసఫ్జాహీ ప్రభువు.. నిజాంఅలీఖాన్ కాలంలో నిర్మల్ జాగీర్దార్గా ఉన్న ఇబ్రహీంఖాన్ (1710-82) మత పక్షపాతంతో విధ్వంసకరమైన పనులు చేశాడు. అప్పుడు ప్రజలు అతన్ని ‘ధంసా’ (ధ్వంసం)అనే పేరుతో పిలిచేవారు. నిర్మల్ వాసి అయిన కవి భల్లా పేరయ్య 1750లో రచించిన తన ‘భద్రగిరి శతకం’లో అతని దుశ్చర్యలను వర్ణించాడు. ముస్లింల అరాచకానికి గురైన భద్రాద్రి క్షేత్ర దైవాన్ని అధిక్షేపిస్తూ కవి నిందాస్తుతిగా ఈ శతకం రచించాడు.
నల్లగొండ జిల్లా పిల్లలమర్రి వాసి అయిన విశ్వబ్రాహ్మణ కవి బంగారు రంగప్ప 1770లో కాకతీయ సేనాని భేతాళరెడ్డి కథను ‘భేతాళ చరిత్ర’ పేరుతో ద్విపదలో చారిత్రక కావ్యంగా రచించాడు. రాచకొండ పద్మనాయక రాజుల చారిత్రక విశేషాలు దీనిలో ఉన్నాయి. చారిత్రక రచనలకు కూడా తెలంగాణయే ఆద్యం అని చెప్పాలి.
రోహిల్లాలు అనే దొంగలు ధర్మపురి ఆలయాన్ని, ఊరును 1858లో దోపిడీ చేసిన వృత్తాంతాన్ని ‘రోహిల్లాల పాట’గా కాకుత్సం నర్సింహారావు (1790-1860) రచించాడు. అతని తండ్రి శేషప్ప ‘కృష్ణ శతకం’ను రచించాడు. ఇది ప్రసిద్ధమైన శతకం.
పరశురామపంతుల లింగమూర్తి (1710- 1800) వరంగల్ ప్రాంతం వాడు. తత్తకవి. ‘సీతారామాంజనేయ సంవాదం’ అనే వేదాంత కావ్యాన్ని రచించాడు. ఇది మూడు ఆశ్వాసాల గ్రంథం. దీనిలో వేదాంత విషయాలు సరళంగా చెప్పబడినాయి. ఈ కవి ‘మనసా’ అనే మకుటంతో ‘మానస శతకా’న్ని కంద పద్యాల్లో రచించాడు. దీనిలో అద్వైత భావాలున్నాయి. అతని ‘గోవింద శతకం’ భక్తి వేదాంత అంశాలు కలిగిన శతకం. ఇవే గాక ఈ కవి ‘జీవన్ముక్త ప్రకరణం’ అనే యక్ష గానాన్ని, ‘బ్రహ్మనారద సంవాదం’, ‘గోవింద శతకం’ ను రచించాడు.
నైజాం రాజ్యాన్ని పాలించిన ఆఖరి రాజులు మహబూబ్ అలీఖాన్ (1869-1911). అతని కుమారుడు ఉస్మాన్ అలీఖాన్ (1911-1948). వీరి కాలంలో బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరిగిపోయింది. నిజాం పాలనలో జాగిర్దారులు, దొరలు వీళ్లేగాక బ్రిటిష్వారు ప్రజలను దోచుకోవటంలో పోటీపడ్డారు. ప్రజలు బనిస బతుకు బతికారు. పేద రైతులు తినటానికి తిండిలేక ఆకలిచావులకు గురయ్యారు. ఈ ఇతివృత్తాలు మనకు భాస్కరభట్ల కృష్ణారావు రాసిన ‘ఇజ్జత్ శిక్ష’, మంద రామారెడ్డి ‘సర్కారు సీమ’ మొదలైన కథల్లో ప్రతిఫలించి కనిపిస్తాయి.
నిజాం దొరలు, అధికారుల దౌర్జన్యాలతో వెట్టిచాకిరితో ప్రజలకు నోరెత్తి మాట్లాడే స్థితి లేదు. ప్రజలు పరజాతీ సంస్కృతీ భాషలతో నలిగిపోయారు. నాలుగు శాతం అక్షరాస్యతతో అజ్ఞానంధకారంలో ఉండిపోయారు. తమదైన భాషా సంస్కృతి, సాహిత్యానికి దూరమయ్యారు.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606