కాకతీయులు మొదట పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండి వారికి విధేయులుగా హనుమకొండ అధిపతులుగా మెలగినారు. చాళుక్య త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో మహామండలాధీశ్వరుడుగా కాకతి రెండవ పోలరాజు పరిపాలన చేస్తున్న సమయంలో అతని బంటు అయిన మల్లె నాయకుడు మాటేడులో ఒక శాసనం వేయించాడు. శాసనకాలం శక సంవత్సరం-1042 = క్రీ.శ.1120, శార్వరినామ సంవత్సరం చైత్రశుద్ధ తదియ, గురువారం.
మహా సామంతుడైన రేవ, బొడ్డమ పుత్రుడైన మల్లెనాయకుడు ఈశ్వర దేవునికి, నారాయణ దేవునికి, ఆదిత్యదేవునికి గుడులు కట్టించి (ఎత్తించి) వ్రిత్తులు సమర్పణ చేసి శాసనం వేయించినాడు. కొండూరి మల్లోజు కొడుకు బొల్లోజు సూత్రధారిగా చెప్పబడినాడు.
మహా దేవరకు, ఆదిత్య దేవరకు, ఇండ్లలికెడు తాపసులకు మల్ల సముద్రమున 2 మర్తురులు, నివేద్యమునకు 1 మర్తురు, వెలిపొలము 1 ఖ, నారాయణదేవునికి నైవేద్యానికి 1, వెలిపొలము 1 ఖ, వినాయకునికి 1, బ్రహ్మపురులకు 4 మర్తురులు సమర్పించబడినవి.
శాసనం మూడవ పక్క నారాయణ దేవునికి సంబంధించిన పొలమును గూర్చి చెప్పబడినది. ఈ పొలము మంజె భట్టుకు చెందినది. ఈ శాసనం రచయిత ‘వెంకన’గా పేర్కొనబడినది. శాసనంలో మంజె భట్టుకు చెందిన వంశ వర్ణన ఉన్నది. బ్రహ్మ నాలుగు వర్ణాలను సృష్టించినాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వీరి సంరక్షణకు పుళింద వంశ పూర్వికులను సృష్టించినాడు. ఆ వంశంలో సుపుణ్యాత్ముడైన బుచ్చెన పుట్టినాడు. ఇతడు నందగోంట మల్లండు, వేమబోల కుల భూషణుడుగా కీర్తించబడినాడు. ఇతనికి రాముడు, అప్ప, రేవండు, నాచండు అనే నలుగురు పుత్రులు. ఇందులో రేవండు బేత భూపతి అనుంగుడుగా ఉండినాడు. కాకతీయుల కీర్తిని బహిర్గతం చేసి వారి శత్రువులను జయించి వారి సామ్రాజ్యం విస్తరించడంలో దోహదపడినాడు. అదేవిధంగా వారినుంచి అనేక సత్కారాలు, బిరుదులు, గ్రామాలు పొంది తామ్రపత్రాలు పొందినాడు. ఇతని కుమారుడే మల్లె నాయకుడు. ఇంకా ఇతడు పెద్ద తటాకాన్ని కూడా తవ్వించాడు. ఈ శాసనంలో పేర్కొనబడిన పుళింద వంశం ప్రముఖమైనదిగా పేర్కొనబడినది.
శాసనంలో వంశ వర్ణన ఎక్కువగా ఉంది. దాన విషయం కొంత పేర్కొనబడింది. కాకతీయుల సామంతులుగా, వారి బంటులుగా ఉన్నవారు కూడా తమ పరిధిలో దేవాలయ నిర్మాణాదులు, బ్రాహ్మణులకు దాన ధర్మాదులు నిర్వహించినారడనడానికి ఈ శాసనం ఒక మంచి
ఉదాహరణ.
-భిన్నూరి మనోహరి