కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో జన్మించి అక్కడి గోపాలస్వామి భక్తుడైన వాడు క్షేత్రయ్య. అతని అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం వంటి క్షేత్రాలను ఎన్నింటినో దర్శించటం వల్ల అతడు క్షేత్రయ్య అయినాడు. శ్రీకృష్ణుడిని నాయకునిగా చేసి శృంగార పదాలు రచించాడు. ఆయన తంజావూరు రాజైన రఘునాథ నాయకునిచే సన్మానించబడ్డాడు. ఆ తర్వాత క్షేత్రయ్య గోలకొండ రాజు అబుల్ హసన్ తానీషా ఆస్థానాన్ని సందర్శించి సన్మానం పొందాడు. క్షేత్రయ్య తానీషాపైన వెయ్యి పదాలు చెప్పాడని అంటారు. దేవుని మీదనే గాక, క్షేత్రయ్య రాజుల మీద కూడా పదాలు రచించాడు. క్షేత్రయ్య పదాలు సంగీతం, సాహిత్యం, అభినయాలకు నిలయమైన పదాలు. అవి చాలా ప్రసిద్ధి చెందినవి.
కందుకూరి రుద్రకవి ‘జనార్దనాష్టకము’, ‘సుగ్రీవ విజయం’ అనే యక్షగానాలు, ‘నిరంకుశోపాఖ్యానం’ అనే కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యాలేగాక ‘బలవదరీ శతకం’, ‘స్మరదీపిక’ అనే కామశాస్ర్తాన్ని రచించాడని తెలుస్తున్నది. కానీ అవి అలభ్యం. జనార్దనాష్టకములో ‘కందుకూరి జనార్దనా’ అనే మకుటంతో ఎనిమిది పద్యాలున్నాయి. ‘అష్టకం’ అనే ప్రక్రియలో పాల్కుర్కి సోమన ‘వృషభాష్టకం’, ‘బసవాష్టకం’, ‘త్రివిధ లింగాష్టకం’ రచించాడు. ఇవి సంస్కృత ప్రక్రియలో రాసిన రచనలు. రుద్రకవి ‘జనార్దనాష్టకం’ తెలుగులో రాయబడిన మొట్ట మొదటి అష్టకం. ఇది శృంగార రసభరితంగా, వర్ణనలు రమ్యంగా ఉన్నాయి. మాత్రా ఛందస్సులో రాయబడినాయి. ఆ తర్వాత తెలుగులో అష్టకాల ప్రక్రియలో చాలా రచనలు జరిగాయి. ఈ మధ్య కాలంలో బాపు బొమ్మలతో జనర్దనాష్టకం అందంగా ప్రచురించబడింది. దీనికి ఆరుద్ర పీఠిక రాశారు.
రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ తెలుగులో మొట్టమొదటి యక్షగానం. సీతాన్వేషణ నుంచి సుగ్రీవుని పట్టాభిషేకం వరకు రామాయణ ఇతివృత్తం ఉన్నది. కరుణాది రసాలను పాటించాడు. దీనిలో ‘పాటలు’, ‘ఏలలు’, ‘వచనాలు’, ‘ద్విపదలు’ ఉన్నాయి. సంగీతబద్ధమైనది. యక్షగానం కాబట్టి సంవాద శైలి దీనిలో ఉంది. దీన్ని రుద్రకవి కందుకూరి జనార్దన దేవునికి అంకితంగా ఇచ్చాడు. ఆ జనార్దన దేవుని వసంతోత్సవ సమయంలో ఈ యక్షగాన నాటకం ప్రదర్శింపబడి ఉంటుంది. యక్షగానం ప్రక్రియ రుద్రకవి రచనతో తెలంగాణలో ప్రారంభమై దక్షిణ దేశానికి వ్యాపించి దక్షిణాంధ్రయుగంలో వేలకొలది యక్షగానాలు రచింపబడినాయి. ఇప్పటికీ తాళపత్ర గ్రంథాలయాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.
కందుకూరి రుద్రకవి విశ్వబ్రాహ్మణ కులజుడు అని చాటుపద్యాల వల్ల తెలుస్తున్నది. రుద్రకవికి గోలకొండ రాజు మల్కిభరాముడు (ఇబ్రహీం షా) నల్లగొండ జిల్లాలోని చింతలపాలెంను అగ్రహారంగా దానమిచ్చినట్లు క్రీ.శ.1558 నాటి శాసనం వల్ల తెలుస్తున్నది. రుద్రకవి మరో రచన ‘నిరంకుశోపాఖ్యానం’. ఇది శ్రీనాథుని కాశీఖండంలోని ‘గుణనిధి కథ’ వలె ఉన్నది. ఈ కావ్యంలో నాయకుడు నిరంకుశుడు. నిరంకుశుడు గుణనిధి కన్నా దిగజారినవాడు. అయినా చివరకు అతడు మోక్షం పొందటం ఈ కావ్యంలోని ఇతివృత్తం. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. ప్రౌఢ శైలిలో ఉన్నది. ఈ కావ్యాన్ని కవి కందుకూరులో వెలసిన సోమేశ్వరునికి అంకితంగా ఇచ్చాడు. కందుకూరు నల్లగొండ జిల్లాలో ఉందని ప్రసిద్ధ చారిత్రకులు బీఎన్ శాస్త్రి తెలిపారు.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606