అనేక ప్రాంతాలు, రాష్ర్టాలు, భాషలు, సంస్కృతులు, మతాలు, కులాలున్న భారతదేశాన్ని ఒక దగ్గర నిలిపి ఉంచుతున్నది సమాఖ్య విధానమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఇది. కీలకమైన ఈ అంశంలో కేంద్రంలోని మోదీ సర్కార్ తరచూ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం దేశ ప్రజాస్వామిక, సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజనను ఇప్పట్లో చేపట్టబోమన్న ప్రకటన కేంద్రం ఆధిపత్య ధోరణికి తాజా నిదర్శనం. పెరిగిన జనాభాకు, మారిన భౌగోళిక పరిస్థితులకు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాలను పెంచటం అన్నది ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పనిసరి అంశం. సమాజంలోని అన్నివర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించటానికి ఇది అవసరం. కానీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి దీనికి అనుగుణంగా లేకపోవటం శోచనీయం.
అసెంబ్లీ సీట్లను తెలంగాణలో 119 నుంచి 153కి, ఏపీలో 175 నుంచి 225కి పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఈ విషయంలో కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేశాయి. ఇంతకాలం పట్టించుకోని కేంద్రం.. ఈ ప్రతిపాదనను 2026 తర్వాత చేపట్టే జనగణన అనంతరంగానీ పరిశీలించబోమని ఇప్పుడు ప్రకటించింది. దేశంలో జనగణన ప్రతీ పదేండ్లకోసారి.. అదీ దశాబ్దం ప్రారంభం లో జరుగుతుంది. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణం గా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. తదుపరి జనగణన జరిగేది 2031లో లేదా ఆ తర్వాత. ఆ నివేదిక రావటానికి మూడేైండ్లెనా పడుతుంది. అంటే కనీసం 2034 వరకూ తెలంగాణ, ఏపీల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన అటకెక్కినట్టే. ఇదే కేం ద్రం జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రం వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. ఒకే అంశం విషయంలో ఒకచోట ఒక విధంగా, మరోచోట మరో విధంగా ప్రవర్తిస్తున్నది.
తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న జల వివాదాల విషయంలోనూ కేంద్రం ఆధిపత్య ధోరణితోనే వ్యవహరిస్తున్నది. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి కృష్ణా, గోదావరి నదుల ప్రాజెక్టులను, సమస్త సిబ్బందిని బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ ఏకపక్షంగా వ్యవహరించింది. గోదావరి జలాలపై ఎటువంటి వివాదం లేకున్నా.. ఆ ప్రాజెక్టులను కూడా హస్తగతం చేసుకుంది. రాజ్యాంగం ప్రకారం జలవనరులు రాష్ర్టాల పరిధిలోని అంశం. కానీ కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం గౌరవాన్ని పొందుతున్నదంటే.. దేశంలోని సమాఖ్య విధానమే కారణం. దానికి తూట్లు పొడవటం దేశానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.