చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. క్రీ.శ. 13వ శతాబ్ది వాడు. ‘ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉన్నాడని, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి కూడా మల్లికార్జునుడిని దర్శించక పోవడం వల్ల గుడ్డివాడైనాడని’ అంటారు. తర్వాత మల్లికార్జునుని
ప్రసాదం, పాల్కుర్కి సోమన దయవల్ల దృష్టిని పొందాడనే కథా ప్రచారంలో ఉంది.
చక్రపాణి రంగన శివదీక్షను పొందిన తర్వాత అనేక రచనలు చేశాడు. ఆయనకు చూపు వచ్చాక ‘నయన రగడ’, ‘నమశ్శివాయ రగడ’లను రచించాడు. ‘నయన రగడ’ 342 పదాలు కలిగిన కృతి. దీనికి ‘శివభక్తి దీపిక’ అనికూడా పేరు ఉంది. తనకు కండ్లు వస్తే తన ఎత్తు కృతులను సమర్పిస్తానని రంగనాథుడు మొక్కుకున్నట్లు ‘రగడ’లో ఉన్నది. ఈ కవి తర్వాతికాలంలో ‘వీరభద్ర విజయం’, ‘శరభలీల’, ‘గిరినాథ విక్రమము’, ‘దండకము’, ‘తారావళి’, ‘శతకము’, ‘రగడ’లు మొదలైనవి ఎన్నో రచించాడు. కొలను ప్రతాపరుద్రుడు తన ‘శివయోగసారం’లో చక్రపాణి రంగనను ప్రశంసించడం ఒక విశేషం.
కృష్ణమాచార్యులు తెలుగులో మొట్టమొదట వచనములు రాసిన కవి. ప్రతాప చరిత్రలో ఈ కవి జీవిత విశేషాలు ఉన్నాయి. ఇంటిపేరు శ్రీకంఠ కృష్ణమాచార్యులు (క్రీ.శ. 1290-1330). ఈనాటి మహబూబ్నగర్ జిల్లాలోని సంతూర్ గ్రామంలో వైష్ణవ కుటుంబంలో జన్మించాడు.
తెలంగాణలో ఒకవైపు వీరశైవం విజృంభిస్తున్నా, ఇంకొకవైపు తమిళ దేశంలో శ్రీరామానుజాచార్యులు బోధించిన వైష్ణవం ప్రవేశించింది. కృష్ణమాచార్యులు రెండవ ప్రతాపరుద్రునికి సమకాలికుడు. ఆ రాజు ఇతణ్ని 50 గ్రామాలకు అధికారిని చేశాడు. కృష్ణమాచార్యులు పుట్టుగుడ్డి. ఆ కారణంగా తల్లిదండ్రులు అతణ్ని పాడుపడ్డ బావిలో పడేశారట. అతడిని ఒక సన్యాసి కాపాడి సింహాచలానికి చేర్చాడు. అక్కడ సింహాచల నరసింహస్వామి ఈ గుడ్డిబాలుడికి పాలు ప్రసాదంగా ఇచ్చాడట. ఆ పాలతో కండ్లు తుడుచుకోగా కృష్ణమాచార్యులకు అంధత్వం తొలిగి పోయిందట. ఆ రాత్రి దేవుడు వరాహ రూపంలో అతడికి కలలో కనపడి ‘చాతుర్లక్ష వచనాల’ను రాయమని కోరాడట. కృష్ణమాచార్యులు అశక్తుడైనా భగవంతుని అనుగ్రహంతో జ్ఞానవంతుడై దండే, చిటితాళాలను ధరించగానే సంకీర్తనలు చెప్పటం ఆరంభించాడట. ఆ విధంగా కృష్ణమాచార్యులు ‘చాతుర్లక్ష వచనాలు’ రచించాడని అంటారు. కానీ, ఇప్పుడు 60 మాత్రమే లభిస్తున్నాయి.
కృష్ణమాచార్యులకు మేనమామ కూతురితో వివాహం జరిగింది. అతడికి ఒక కుమారుడు పుట్టగా అతడు పదవ ఏటనే మరణించాడు. ఆ సంఘర్షణతో కృష్ణమాచార్యులు భక్తిమార్గం విడిచి వేశ్యాలోలుడైనాడట. భాగవత సోదరుల ప్రేరణతో ఆయన తిరిగి భక్తిమార్గంలోకి ప్రవేశించి శ్రీరంగం చేరుకొని అక్కడే ఉండి పోయాడట.
కృష్ణమాచార్యులు రచించిన ‘సింహగిరి వచనము’ల తాళపత్ర ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో లభించింది. అదే 1968లో ప్రచురితమైంది. కృష్ణమాచార్యులు రచించిన ‘సింహగిరి వచనములు’ వైష్ణవభక్తితో కూడిన తాళబద్ధం, గణబద్ధం కానటువంటి గద్యరచనలు. సోమనాథాది శివకవులు ‘గద్యం’ అని పేర్కొన్న ప్రక్రియనే వైష్ణవులు ‘వచనం’ అన్నారు. ఇవి దైవభక్తితో పారాయణం చేసే రచనలు. రామానుజాచార్యులు కూడా భక్తి గద్యాలు రశాడు. అవి సంస్కృతంలో ఉన్నాయి. కృష్ణమాచార్యులు ఆ గద్యాలనే వచనములు అనే పేరుతో సులభమైన తెలుగుశైలిలో రచించాడు.
తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు 16వ శతాబ్దంలో ‘సంకీర్తన లక్షణం’ అనే గ్రంథంలో కృష్ణమాచార్య వచనాలను ‘పదములు’ అని పేర్కొన్నాడు. కృష్ణమాచార్యులు వచన వాఙ్మయ ప్రథమాచార్యుడని, సంకీర్తన ప్రథమాచార్యుడని ప్రశంసించాడు. రగడలు, స్తోత్రాలు, మాత్రా, గణబద్ధంగా ఉండగా వచనములు ఛందోబద్ధం కాకుండా పాద నియమాలు లేకుండా శబ్దాలంకారాలు లేకుండా అచ్చంగా వచనంలో ఉంటాయి. చివరలో మాత్రం ‘సింహగిరి నరవహరి నమో నమో దయానిధి’ అనే మకుటాన్ని కృష్ణమాచార్యులు చేర్చాడు. వీటిలో పూర్తిగా విష్ణునామ సంకీర్తనం ఉంది. కొన్నిటిలో భక్తుల వృత్తాంతాలు ఉన్నాయి. ఆయన శైలి సరళంగా ఉంది.