సాహిత్యరంగంలో విమర్శ అనే పదానికి అనుశీలన, పరిశీలన, పర్యాలోచనం, మీమాంస, వివేచనం, సమాలోచన, సమీక్షణం మొదలైనవి సమానార్థాలుగా ఉన్నాయి. విమర్శ అను శబ్దంలో ‘వి’ అను ఉపసర్గ, ‘మృశ్’ అన్న ధాతువు ఉన్నాయి. ‘వి’ అను ఉపసర్గ విశిష్టార్థంలో చేరింది. ‘మృశ్’ అను ధాతువునకు పరామర్శించు, పరీక్షించు, చర్చించు అన్న అర్థాలున్నాయి. అందువల్ల ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని చక్కగా పరిశీలించి చర్చాపురస్సరంగా దానిలోని మంచి చెడులను వ్యాఖ్యానించటం ‘విమర్శ’ అని చెప్పవచ్చును.
విమర్శకు సాహితీవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను పరిశీలిద్దాం.
పాశ్చాత్యుల నిర్వచనాలను పరిశీలిస్తే – Criticism may be regarded as having two different functions that is interpretation and of judgement – Hudson. వస్తు తత్త్వమును తెలిపేది, దాని గుణగణాల్ని నిర్ధారించేది విమర్శ అని అర్థం.
-Criticism as I understand, it is an endeavour to discriminate between experiences and to evaluate them – J.A. Richards. అనుభూతుల తారతమ్యాల్ని వివేచించి, వాటి విలువల్ని అంచనా వేసేది విమర్శ అని అర్థం.
ఈ నిర్వచనాలను పరిశీలించినపుడు, విమర్శ ముఖ్యలక్షణాల్ని ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చును.
విమర్శలో సాహిత్య గుణగణాల నిర్ధారణ ఉంటుంది. విమర్శలో సాహిత్యాన్ని గురించి పరిశీలన ఉంటుంది. విమర్శ సాహిత్య విలువలను వ్యాఖ్యానిస్తుంది. విమర్శ విమర్శకుని బుద్ధివ్యాపారం. విమర్శకుడు ఇష్టారాజ్యంగా చేసే పని విమర్శ. విమర్శ విమర్శకుడు చేసే కళాత్మక కార్యం. సాహిత్యంలో వస్తు తత్త్వ నిరూపణ విమర్శలో ఉంటుంది. అలంకారాది శాస్త్ర సంప్రదాయాల్ని విమర్శలో వినియోగించటం ఉంటుంది. విమర్శలో పద సద్వివేచన ఉంటుంది.
విమర్శ స్వరూపం
ఆకృత్రిమ అహంభావ పరామర్శ విమర్శ అని అర్థం అవుతుంది. సృష్టిలో తన్నుతాను చూసుకుని ఆనందించటం విమర్శగా భావించవచ్చును. కావ్య సంబంధమైన స్వానుభవం విమర్శ అని కొందరి అభిప్రాయం. లౌకికాలైన దేశ కాల వ్యక్తిత్వాలకు దూరంగా ఉండే విషయ చర్చే విమర్శ అవుతుంది. ప్రాచీన కావ్యాలలో కవి పండిత పదాలు కనిపిస్తాయిగానీ, విమర్శకుడు అను శబ్ద ప్రయోగం లేదు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ‘పండిత’ శబ్దాన్ని విమర్శక శబ్ద పర్యాయపదంగా ప్రయోగించటం. విమర్శ భగవంతుని యందు విశ్వ సంబంధానుభూతి అని, ఆకృతిమయమని ప్రాచీన తత్వశాస్ర్తాలు తెలుపుతాయి.
విమర్శ రెండు విధాలు. సద్విమర్శ, అసద్విమర్శ. విమర్శకుడు సహృదయుడై, దేశ కాల వ్యక్తిత్వాలకు అతీతంగా చేసే విమర్శ సద్విమర్శ. ఇది సార్వకాలికంగా, సర్వదృష్టితో మేలు చేకూర్చేదిగా ఉంటుంది. అలా కాకుండా లౌకిక విషయాలకు తావిచ్చి, ఇష్టమైన విషయానుభవంతో చేసే విమర్శ అసద్విమర్శ అవుతుంది. స్వాభిమానాన్ని, స్వభావాన్ని ఆపేక్షించి చేసే విమర్శ అనాదరణీయం అవుతుంది. విజ్ఞులైన పండితులు అసద్విమర్శను ఆదరించరు.
కువిమర్శలో ఈ కింది అవలక్షణాలుంటాయి.
కావ్యం స్వతంత్య్రం కాదు అనుకోవటం. విమర్శ పిడివాదం అనే భావన ఉండటం. స్వాత్మాభిమానం ఉండటం. పాక్షిక దృక్పథం ఉండటం. దేశ కాలాభిమానాలు అనుసరించటం.
కవి సహృదయుల సమ్మేళన సరస్వతీ తత్వం అంటే కావ్యతత్వానికి కవి, సహృదయుడు ఇద్దరూ ఆధారమే. కవి తన అనుభవాల్ని కావ్యరూపంలో ఉంచుతాడు. సహృదయుడు దాన్ని పరామర్శిస్తాడు. కావ్యంలో కవి నిక్షేపించిన శిల్పాన్ని సహృదయుడు అనుభవిస్తాడు. కావ్యంలో అభివర్ణించిన రసానుభూతిని పొందిన వ్యక్తి విమర్శకుడౌతాడు. అంటే కావ్యసంబంధమైన అకృత్రిమానుభవం కలవాడు విమర్శకుడౌతాడు. దేశ, కాల, వ్యక్తిగత విషయాలకు అతీతం అయి కేవలం రసానుభూతిని అభివ్యక్తీకరించటం కోసం కవి కవితామార్గాన్ని, విమర్శకుడు విమర్శ మార్గాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి విమర్శకుడు భావానుభూతిని పొంది, ఆ అనుభూతికి ఆధారమైన కావ్యగత శిల్ప విషయాలను పరామర్శ చేసేవాడు. విమర్శకునికి ఉండే మంచి, చెడు అభిరుచుల ఆధారంగా విమర్శ ఉంటుంది. మంచి అభిరుచి కలిగిన విమర్శకునిచే సద్విమర్శ, చెడు అభిరుచిగల విమర్శకునిచే అసద్విమర్శ వెలువడుతాయి. సత్వగుణోపేతుడైన విమర్శకుని ద్వారా సద్విమర్శ లోకంలో వ్యాప్తి చెందుతుంది. ఇతడు సత్వ గుణం వలన రసాస్వాదన చేస్తాడు. తాను ఆస్వాదించిన దానిని విపులీకరించి అభివ్యక్తం చేస్తాడు. ఇతరుల కష్టసుఖాలను తనకాపాదించుకుని రసాస్వాదన చేస్తాడు.
విమర్శకులలో Popular Taste and Artistic Taste అని రెండు విధాల అభిరుచులు ఉంటాయి. Artistic Taste ద్వారా సద్విమర్శ ఉద్భవించి లోకకల్యాణానికి ఉపకరిస్తుంది. Popular Taste వల్ల సమాజంలో అసద్విమర్శ బయలుదేరి సంఘవిభజనకు దోహదకారి అయి పరస్పర ద్వేషాన్ని రేకెత్తిసుంది. ఎక్కువమంది ఆదరించేది Popular Taste అయినా, వర్తమాన భావికాలాల్లో ప్రకాశించేది Artistic Taste మాత్రమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలలో రాగద్వేషపూరక కృతాలైన విమర్శలు అసద్విమర్శలు. కావ్య విమర్శకుడు అలంకార శాస్త్ర పఠనంతోపాటు శిష్టాచార రూపమైన ప్రాచీన వాఙ్మయాన్ని కూడా మదిలో ఉంచుకుంటే సద్విమర్శ చేయగలడు. సహృదయ విమర్శకుడు రసాస్వాద యోగ్యమైన హృదయం కలవాడే కాక తాను దర్శించి కావ్య సౌందర్యాన్ని చిత్రించి చూపే శిల్పి కూడా. కవి ప్రకృతి గతమైన సౌందర్యాన్ని దర్శించి దానికి రూపకల్పన చేసి లోకానికి సాక్షాత్కరింపచేసినట్లుగానే, ఆ రూపకల్పనలోని సౌందర్యాన్ని దర్శించి దానికి రూపకల్పన చేసి పఠితులకు సాక్షాత్కరింపచేసేవాడు విమర్శకుడు. అంటే విమర్శకుడు కవి లాంటి శిల్పి కావడమే గాక అతని ప్రజ్ఞను ప్రదర్శించే వ్యాఖ్యాత కూడ అవుతాడు.
సాహిత్య ప్రగతికి విమర్శ దోహదం చేస్తుంది. పలురకాలైన సాహిత్యాన్ని గురించి విమర్శ వివరించి చెప్పటం వలన, ఉత్తమ సాహిత్యం ఎలాంటిదో తెలుసుకున్న పాఠకులలో తాము కూడా ఉత్తమ సాహిత్యానికి కృషి చేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి సాహిత్య పఠనానికి విమర్శ దోహదం చేస్తుందని చెప్పవచ్చు. రచనకు-విమర్శ కు, రచయితకు-విమర్శకునికి అవినాభావ సంబం ధం ఉంది. ఈ అనుబంధంతో సాహితీ ప్రక్రియ విజయపథంలో నడుస్తుందని ఆశిద్దాం.
విమర్శ రకాలు
లక్షణ విమర్శ: ఇది కవులకు మార్గదర్శకంగా కావ్య లక్షణాన్ని ప్రతిపాదిస్తుంది. శాశ్వత సాహిత్య ప్రమాణాల్ని నిర్దేశిస్తుంది.
సూత్ర విమర్శ: ఇది కూడా సాహిత్య రచనకు సంబంధించిన సూత్రాలనే ప్రతిపాదిస్తుంది. అయినా విలక్షణ విమర్శ పేర్కొనే శాశ్వత ప్రమాణాల కంటే ప్రక్రియను సాపేక్ష, గుణమైన సిద్ధాంతాల్ని నిర్దేశిస్తుంది.
అలంకార విమర్శ: దీనినే లాక్షణికం అని కూడా అంటారు. లక్షణ గ్రంథాలలోని ప్రమాణాలకు అనుగుణంగా కావ్య విమర్శ చేస్తుంది.
స్వతంత్ర విమర్శ: కావ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి విషయ పరిశీలన చేస్తుంది. దీనివల్ల కవి ప్రతిభ, కావ్య సౌందర్యం, కావ్య పరమార్థం నిరూపించబడతాయి.
కవి జీవిత విమర్శ: కవి ఆత్మీయత, వ్యక్తిత్వం, కవి జీవితంలోని భౌతిక, మానసిక, తాత్విక విశేషాలు కావ్యంలో ఎలా ప్రతిఫలిస్తాయో కవి జీవిత విమర్శ ద్వారా తెలుసుకోవచ్చు.
చారిత్రక విమర్శ: ఈ విమర్శ ద్వారా కవి కాల నిర్ణయం, జన్మస్థల చర్చ వంటి విషయాలు నిర్ధారించబడతాయి. సమకాలీన మత, సాంఘిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కవితలపై ఏవిధంగా ప్రతిఫలించిందో తెలుసుకోగలం.
తులనాత్మక విమర్శ: ఈ పరిశీలన కవి స్థానం నిర్ణయించటానికి, కావ్యతత్వాన్ని నిరూపించటానికి ఉపయోగపడుతుంది. అంతేకాక వివిధ భాషా కవులలోని తారతమ్య పరిశీలన ద్వారా కావ్య ప్రమాణాల్ని ఈ విమర్శ ద్వారా తెలుసుకోవచ్చును.
పరిష్కరణ విమర్శ: ఆధారభూతమైనది పరిష్కృత కావ్యం. కావ్యం మూల ప్రతిని నిర్ణయించటం, శుద్ధ ప్రతిని రూపొందించటం ఈ విమర్శ ద్వారా సాధ్యపడుతాయి.
-డాక్టర్ దేవులపల్లి పద్మజ , 98496 92414