తెలంగాణ సాహిత్య ప్రస్థానం 41
అయ్యా బానిసను అనిన పౌరుడే/ అయ్యగొంతుక నట్టే అదుమున్.. అని కాళోజీ ప్రజల పోరాటాన్ని వర్ణించాడు.
ప్రజాకవిగా పేరొందిన కాళోజీ చేతలోనూ, రాతలోనూ విప్లవకారుడు. అతని కవిత్వం సూటిగా తీవ్రంగా ఉంటుంది. అతని ‘నా గొడవ’లో.. ‘నవయుగంబున నాజీ వృత్తుల/ నగ్న నృత్యంబింకెన్నాళ్లు/ పోలీసుల అండను దౌర్జన్యశక్తుల/ పోషణ బొందేదెన్నాళ్లు..’ అని గర్జించాడు కాళోజీ. ‘తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్/ కృపాణమ్ము..’ అని ప్రజల తిరుగుబాటును వర్ణించాడు.
నిజాం వ్యతిరేక పోరాటంలో దాశరథి ఎన్నోసార్లు జైలుకు పోయాడు. జైల్లో ఉన్నా జైలుగోడల మీద బొగ్గుతో కవిత్వం రాశాడు. ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజుమాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ..’ అని దాశరథి గొంతెత్తాడు. తర్వాత ‘అగ్నిధార’ (1949), ‘రుద్రవీణ’ (1950) పేర్లతో సంపుటాలుగా వచ్చాయి. ‘అగ్నిధార’లను కురిపిస్తూ దాశరథి నిజాంను ఈ విధంగా అంటాడు.. ‘ఇదేమాట ఇదేమాట పదే పదే అనేస్తాను/ కదంతొక్కి పదం పాడి ఇదేమాట అనేస్తాను/ దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి/ తల్లిపిల్ల కడుపుగొట్టి నిక్కిన దుర్మార్గమంత/నీ బాధ్యత..! నీ బాధ్యత..’ అంటూ నిప్పులు చెరిగాడు.
‘వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా/ నీకు నిలుచు హక్కులేదు నీకింకా దిక్కులేదు/ దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది/ దిగిపోవోయ్..,తెగిపోవోయ్..,తెగిపోవోయ్.. దిగిపోవోయ్..’ అంటూ గర్జించాడు. ఇంకా ప్రజలకు ‘ఇక ఆగకండి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్ర సురపురమ్ము..’ అం టూ పిలుపునిచ్చాడు దాశరథి.
ఆంధ్ర ప్రాంతంలో శిష్ట్లా నారాయణబాబు, పఠాభి, శ్రీశ్రీ కవితలతో అభ్యుదయయుగం ఆరంభమైంది. భావకవిత్వం మీద తిరుగుబాటు చేసి కొత్త పంథాను తేవాలని వారు నడుం కట్టారు. పఠాబి.. ‘నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో/ పద్యాల నడుముల్ విరుగదంతాను/ చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాలా దండిస్తాను..’అని భాష, భావాలు, ఛందస్సుల మీద తిరుగుబాటు చేసి నవ్యతను సృష్టిస్తానంటాడు.
వీళ్లల్లో శ్రీశ్రీ మాత్రం మార్క్సిజంతో పరిచయమై.. ‘దీనులారా హీనులారా/ కూడులేని, గూడులేని/ పక్షులారా, భిక్షులారా../ హతాశులై/ ఏడవకండేడవకండి/ పతితులా రా భ్రష్టులార / ఏడవకండేడవకండి వస్తున్నాయొస్తున్నాయి/ జగన్నాథ/ జగన్నాథ రథ చక్రాల్..’ అని పేదలకు దీనులకు మరో ప్రపంచం చూపాడు.
ఈ కవుల అభ్యుదయ పథమంతా భావకవిత్వం మీద తిరుగుబాటు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితా సంపు టి 1950లో అచ్చయింది. ఆ తర్వా త ‘నయాగరా’ (1943) కవితా సంకలనం, కె.వి.రమణారెడ్డి ‘భువన ఘోష’ (1950), సోమసుందర్ ‘కాహళి’ (1953), రెంటాల ‘సర్పయాగం’ (1957), అబ్బూ రి వరదరాజేశ్వరరావు ‘అందాక’ మొదలైన కవితా సంపుటాలు వచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి పత్రికల్లో వార్తలు చదివి సోమసుందర్ ‘వజ్రాయుధం’ (19 49), ఆరుద్ర ‘త్వమేవాహం’ (1949), కుం దుర్తి ‘తెలంగాణ’ (1956) ఖండకావ్యాలు వచ్చాయి. అభ్యుదయ కవులు తెలంగాణ ప్రజల జీవితాలను, పోరాటాలను ప్రతిబింబిస్తూ కవిత్వం రచించారు. 1946-51 వరకు తెలంగాణలో సాగిన విప్లవ పోరాటం రష్యా విప్లవాన్ని తలపించింది. ఆ కాలం లో కవులు రాసిన పాట లు, కవిత్వం నిజమైన నాజీల వంటి పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమం వైపు నడిపిస్తూ రాసినయి.
–ముదిగంటి సుజాతారెడ్డి , 99634 31606