దక్షిణ భారత చరిత్రలో అత్యంత బలవంతుడిగా కీర్తిగడించిన రెండవ పులకేశి బాదామి చాళుక్య వంశానికి చెందినవాడు. ఇతడు క్రీ.శ.610-642 వరకు రాజ్యపాలన చేశాడు. పులకేశి తన విజయయాత్రల్లో అనేక ప్రాంతాలను జయించాడు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అతని అధీనంలోకి వచ్చాయి. అతని ప్రతినిధిగా అతని తమ్ముడు కుబ్జవిష్ణు వర్ధనుడు ఈ ప్రాంతంలో వేంగీ చాళుక్యరాజ్యాన్ని ప్రారంభించాడు.రెండవ పులకేశి మూడవ కుమారుడు మొదటి విక్రమాదిత్యుడు. ఇతడు క్రీ.శ. 654-681 వరకు బాదామీ పాలకుడిగా ఉన్నాడు. అతని అధీనంలోని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో శాసనాలు లభించాయి. అందులో ఒకటి కొల్లాపూర్ రాగిరేకు శాసనం. కొల్లాపూర్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. రెండు రాగిరేకులతో 21 పంక్తుల్లో ఉన్న ఈ శాసనం చాళుక్య వంశ వర్ణనతో ప్రారంభమవుతుంది. చాళుక్యులు మానవ్యస గోత్రానికి చెందినవారుగా, హారీతి పుత్రులుగా, కార్తికేయుని పరిరక్షణలో కళ్యాణ పరంపరను పొందినవారుగా చెప్పబడినారు.
శాసనం వేయించిన మొదటి విక్రమాదిత్యుని పూర్వరాజుల ప్రశంస శాసనంలో చెప్పబడింది. చాళుక్య వంశంలోని పులకేశి మహారాజు వర్ణన మొదట ఉన్నది. ఇతడు చాళుక్య కులతిలకుడుగా, అశ్వమేథయాగం చేసి అవబృథస్నానం చేసిన పవిత్రుడిగా కీర్తించబడినాడు. అతని కొడుకు కీర్తివర్మ. అతడు వనవాసి మొదలైన రాజులచే కీర్తించబడినాడు. కీర్తివర్మ పృథ్వీవల్లభ మహారాజు కొడుకు రెండవ పులకేశి. ఇతడు ఉత్తరాపథేశ్వరుడైన హర్షవర్ధనుణ్ని ఓడించాడు. ఇతని కుమారుడే మొదటి విక్రమాదిత్యుడు. ఇతడు చాలా గొప్పవాడుగా పేర్కొనబడి నాడు. దైవాశ్వమైన చిత్రకంఠంపై అధిరోహించి దాయాదులను, చాలామంది రాజులను జయించాడు. ఈతడు సకల మహా మండలాధిపతిగా, సత్యాశ్రయ శ్రీ పృథివీ వల్లభ మహారాజుగా కీర్తించబడినాడు.
చాళుక్య మొదటి విక్రమాదిత్యుడు పృథ్వీపతి రాజు విజ్ఞప్తి చేయగా కృష్ణానదికి ఉత్తరం వైపు ఒడ్డున ఉన్న కొట్టాత్త సీమలో 108 నివర్తనాల భూమిని దానమిచ్చి శాసనం వేయించినాడు. శాసనకాలం క్రీ.శ. 672. ఈ దానం తన తల్లిదండ్రులకు పుణ్యం కోసం కార్తీక మాసంలోని పౌర్ణమినాడు ఇవ్వబడింది. శాసనంలో ఆది రాజమానం ప్రకారం 108 నివర్తనాల భూమి అని పేర్కొనబడింది. ఆది రాజమానం అనేది నాటికాలంలో కొలమానం కావచ్చు. శాసనంలో తమ వంశం ఇతర వంశీయులు కూడా ఈ దానాన్ని పాటించాలని చెప్పబడింది. శాసనంలో శాపోక్తులు, దానం పాటించినందువల్ల కలిగే ఫలితాలు వ్యాసగీతా శ్లోకాలు చెప్పబడినవి.
-భిన్నూరి మనోహరి