పూర్వపు వరంగల్లు జిల్లా ములుగు తాలూకాలోని మాచాపూర్ గ్రామ సమీపంలో కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం దొరికింది. దీన్ని వేయించినవాడు కాంత మధూక వంశానికి చెందిన వెన్నపరెడ్డి. ఇతడు కాకతీయ సామంతుడు. అశ్వపాలకుడైన రేచర్ల కాటయ పాలనా కాలంలో
ఈ శాసనాన్ని వేయించాడు. శాసనకాలం శ.సం. 1139 = క్రీ.శ. 1217.శా
సన ప్రారంభంలో కాంత మధూక వంశ ప్రశస్తి, వారి వంశావళి వివరంగా చెప్పబడింది. రామిరెడ్డి తమ్ముడైన లోకిరెడ్డి బొల్లమాంబల కుమారుడు వెన్నపరెడ్డి. ఇతడి సోదరులు ఎఱ్ఱపరెడ్డి, ఎక్కరెడ్డి.
శాసనకర్త అయిన వెన్నపరెడ్డి ‘శ్రీనివాసుండు సతతంబు నధిక ధర్మాతుండగు.. సురుండును, దేవ బ్రాహ్మణ భక్తలోచనుండు, బందు నిదానుండు, పరహిత భీరుండు, సచ్చరిత్రుండు, విబుధ సంచితుండు, కనకాద్రి ధీరుండు, వనధి గంభీరుండు, రేచన విబుండు సత్యకుమారుండు, దినకర.. (యశుండు) విక్రముండు ఉభయ కులదీపకుండు, ఉత్తముడు, చతురాననుండు, అభయచిత్తుండు సద్గుణాకరుండు, శ్రీ పర్వత మల్లికార్జున భక్తి నిరతుండు..’ అని ప్రశంసించబడినాడు. ఇంకా ఈ శాసనంలో ఆ వంశానికి చెందిన ఇతరుల పేర్లు క్రమంగా చెప్పబడ్డాయి.
వెన్నపరెడ్డి తన పుత్ర, మిత్ర, కళత్ర సహితంగా పరమానందంతో భోగ, ఉపభోగాలు అనుభవిస్తూ రాజ్యం చేయుచున్నాడని చెప్పబడింది.
శ.సం.1139 ఈశ్వర సంవత్సరంలో వెన్నయపల్లి, బోడుకోడూరువరం గ్రామాలను తాను నిర్మించిన దేవాలయాల నిర్వహణకు దానమిచ్చినాడు. అదేవిధంగా వెన్నపరెడ్డి ఆ కేశవ దేవుని ధూప దీప నైవేదాల్యకు ప్రోలేశ్వర దేవునికి, ఎక్కేశ్వర దేవునికి, పాటి దేవరకు భూమిని సమర్పించినాడు. అదేవిధంగా కార్తీక, వైశాఖ మాసాల్లో జరిగే ఉత్సవాలకు, బ్రాహ్మణులకు వ్రిత్తులను సమర్పించినట్లు తెలుస్తుంది.
ఈ శాసనంలో కాకతీయ గణపతిదేవుడు, రేచర్ల కాటయ ప్రశంసించబడినారు. వెన్నపరెడ్డి కాంతా మధూక వంశం అని చెప్పబడినాడు. ఈ కాంతామధూక వంశంవారు ప్రాంతీయం గా ఉన్న రెడ్డి సామంతులుగా కాకతీయులకు ఉన్నారు. ఈ విషయం బి.ఎన్.శాస్త్రిగారి ‘రెడ్డిరాజ్య సర్వస్వంలో’ వివరంగా తెలుసుకోవచ్చు.