ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీవనంలో నిత్య సాహితీ కృషీవలుడు మడిపల్లి భద్రయ్య. కవి, గాయకులు, నటులు.. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి భద్రయ్య. పౌరాణిక నాటకాలు, కవితలు, గీతాలతో,సాహిత్యంలో కళారంగంలో, సమాజ సేవలో ఐదు దశాబ్దాలుగా సేవలందించారు. ఈ నెల 18న హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు. 1945 జనవరి 17న నిర్మల్లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కళావైభవాలను తెలుపుతూ అనేక పుస్తకాలను రచించారు.
మడిపల్లి సాహితీ సేవలో ‘మన ఆదిలా బాదు, మన భాష-మన యా స’ అనేది విశిష్టమైనది. తెలుగు దనానికి నిజమైన నిదర్శనంగా వేషంలోనూ, భాషలోనూ మన తెలంగాణ భూమి పుత్రుడు ఆయన. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకూ ప్రతిస్పంది స్తూ.. అక్షరబద్ధం చేశారు. సమాజోద్ధరణకు నిరంతరం తపించారు. ప్రతి సంఘటననూ కవితా వస్తువుగా మలచుకొని, రాసి, పాడు తూ వాగ్గేయకారుడిగా కీర్తినొందారు.
మడిపల్లి వారి కుటుంబ పూర్వీకుల చరిత్ర సుదీర్ఘమైనది. దాదాపు 400 ఏండ్ల నుంచి మడిపల్లి వంశం కొనసాగుతున్నది. వంశ స్థాపకుడు బుచ్చయ్య కాగా, 18వ శతాబ్దం నిమ్మనాయుడు నిర్మల్ స్థాపించిన కాలంలో భద్రాచలం ప్రాంతం నుంచి వీరి వంశీకులు నిర్మల్కు వచ్చినట్లు చరిత్ర చెప్తున్నది. మడిపల్లి భద్రయ్య తాత భద్రయ్య (ముత్తాతకు తాత)‘బసవరాజీయం’ (వైద్య గ్రంథం), ‘సారంగధర చరిత్ర’, మంగళ హారతులు, భక్తిగీతాలు.. రాశారు. ‘చెన్నమ ల్లు’ మకుటంతో శతకం రాశారు. మడిపల్లి వంశంలో ఆరోతరానికి చెందినవారు మడిపల్లి భద్రయ్య. తెలంగాణలోని వంజరులు (వన జరులు) వీరి శిష్యులే. ప్రస్తుతం మహారాష్ట్రలోని దేవగాండ్ల వాళ్ల (లింగ ధారులకు)కు ఉపదేశిస్తుంటారు. వీరు కూడా లింగాన్ని ఉపదేశం తీసుకుంటారు. చెన్నమల్లికార్జున పండితారాధ్య వంశంగా చెప్తుంటారు. తెలంగాణలోని లక్షెట్టిపేట, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో ఆరాధ్య సంప్రదాయకులున్నారు.
భద్రయ్య నాన్నపేరు వీరయ్య. శిష్య సంచారం.., వీరిది గురు సంప్రదాయం. వీరయ్య.. ‘శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం’, ‘తందనాన శివలింగ లీలలు’, ‘శ్రీ విశ్వనాయక శతకం’, ‘భిక్కనూరి సిద్ధ రామేశ్వర శతకం’ రాశారు. నాన్న రచనల ప్రభావం భద్రయ్యపై ఉంది. మడిపల్లి భద్రయ్య 1943 మే 8న మడిపల్లి వీరయ్య-గంగమ్మ దంపతులకు నిర్మల్లో జన్మించారు.
భద్రయ్య ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్య గీతం రాశారు. ‘జిల్లంటె జిల్ల కాదో జిల్లా- ఆదిలాబాద్ జిల్లా అడవితల్లి జిల్లా-ఆదివాసి జిల్లా- అందమైన జిల్లా..’ అనే ఆయన పాటను స్కూళ్లలో వందేమాతరం తర్వాత పాడించేవారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రప్రథమంగా జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సకలజనుల సమ్మెలో బాసర నుంచి మంచిర్యాల వరకు పర్యటించారు. ఉద్యమ సభల్లో నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఉద్య మంలో రైలు రోకోలో పాల్గొన్నారు.లక్ష్యసాధన వైపు ప్రజలను నడిపించారు.
అరువై ఏండ్ల వయసులో ఆదిలాబాద్ జిల్లా సుహృద్బావ యాత్రకు నడుం కట్టారు మడిపల్లి భద్రయ్య. 52 మండలాలను మోపెడ్పై తిరుగుతూ ‘మన ఆదిలాబాద్’ పేర బృహత్తర పుస్తకం రాశారు. నేలల రకాలు, మనుషుల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. జలపాతాలు, చెరువులు, కుంటలు, రాజకీయ పరిస్థితులు, సాహితీ సాంస్కృతిక వివరాలు.. గణాంకాలతో పుస్తకాన్ని ముద్రించారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో వాడుకలో వ్యవహారం లో ఉన్న మాటల తీరును ‘మన భాష-మన యాస’ (ఉమ్మడి ఆదిలాబాద్ వ్యావహారిక భాషా పదకోశం) అనే పేరుతో గ్రంథాన్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్యోద్యమానికి జవసత్వాలు అందించిన మడిపల్లి భద్రయ్యకు వినమ్ర నివాళి.
కొమ్మెర రామమూర్తి
99081 46470