వీరశైవ మతం క్రీ.శ. 12వ శతాబ్దంలో కన్నడదేశంలో కళ్యాణి చాళుక్యుల చివరిరాజును కలచురి బిజ్జలుడు చంపి కళ్యాణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని దగ్గర దండనాయకుడిగా బసవేశ్వరుడున్నాడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మత ప్రవర్తకుడు, ప్రచారకుడు. కానీ, బసవేశ్వరుడికన్నా ముందునుంచే కన్నడదేశంలో శివభక్తి, శైవం ప్రచారంలో ఉన్నాయి. శివుడు తప్ప వేరే దైవం లేడని విశ్వసిస్తూ శివభక్తిమయమైన వచనాలు బసవేశ్వరునికన్నా వందేండ్ల ముందునుంచే భక్తులు రాస్తున్నారు. దేవర దాసమయ్య, మాదార చెన్నయ్య, చినకేశవయ్య, శంకర దాసిమయ్య, అల్లయప్రభు, అక్క మహాదేవి వంటి శివభక్తులు శివ పారమ్యాన్ని ప్రచారం చేస్తూ వచనాలు పాడుతూ తిరిగేవారు. రాజాస్థానంలో ఉద్యోగిగా ఉన్న బసవేశ్వరుడు చేతిలో ఖడ్గం పట్టి శైవమతాన్ని ప్రజల్లో ప్రచారం చేశాడు. శివభక్తులుగా మారని వాళ్లను చంపి ‘శివుడే పరమదైవ’మని ప్రజల్లోకి పోయి వాళ్లను శైవులుగా మార్చాడు. హింసామార్గంలో బలవంతంగా ప్రజలను శైవులుగా మార్చడంతో శివుడు తప్ప వేరే దైవం లేడన్న ఈ శైవమతానికి ‘వీరశైవం’ అనే పేరు వచ్చింది. బసవేశ్వరుడు కాకతీయుల్లో మొదటి ప్రతాపరుద్రునికి సమకాలికుడు. వీరశైవ హింసామార్గం అసహనంతో కన్నడ, తెలంగాణల్లో జైనం, బౌద్ధం నామరూపాలు లేకుండాపోయాయి. ఆరామాలు, వసతులు నిర్మానుష్యమై శిథిలమయ్యాయి.
మొదటి ప్రతాపరుద్రుని కాలంలోనే తెలంగాణలోకి వీరశైవం ఉధృతంగా ప్రవేశించింది. మనకు ఆంధ్రదేశంలో మొట్టమొదట కనిపించే వీరశైవ కవి మల్లికార్జున పండితారాధ్యుడు. అతడు బసవేశ్వరుని సమకాలికుడు. కన్నడదేశం నుంచి బసవేశ్వరుడి సందేశాన్ని అందుకొని అతణ్ని దర్శించాలనే అభిలాషతో వేంగినుంచి కన్నడదేశానికి బయల్దేరుతాడు.
తోవలో వెలనాటి రాజేంద్రచోడుని సభకు పోయి అక్కడ బౌద్ధ గురువును శాస్త్రవాదంలో ఓడిస్తాడు. బౌద్ధమతాన్ని ఖండించి శైవాన్ని స్థాపిస్తాడు. ‘శివుని కన్నా మించిన దైవం ఉన్నాడన్న వాళ్ల తలను కాలితో తంతా’నంటాడు. ఆ సభలో బౌద్ధగురువు తన అపజయం, అవమానాన్ని సహించలేక మల్లికార్జునుని దీపమాలె స్తంభాన్ని అందరూ చూస్తుండగా తన శిష్యులతో పగులగొట్టిస్తాడు. అది సహించలేక పండితుని శిష్యులు రేమయ్య, దేవయ్యలు రాజేంద్రుని రాజధాని చందవాలు దగ్గర సముద్రం మధ్య లంకలో ఉన్న బౌద్ధారామంలో ప్రార్థన చేస్తున్న బౌద్ధగురువు శరీరాన్ని, దీపమాలె స్తంభాన్ని పగులగొట్టినట్లుగా ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారు. మల్లికార్జునుడు తానే హత్యను చేయించినట్లు ఒప్పుకుంటాడు. శిక్షగా రాజేంద్రుడు పండితుని కళ్లల్లో జీడిపాలు పోసి గుడ్డివాణ్ని చేస్తాడు. అప్పుడు మల్లికార్జునుడు రాజేంద్రుడిని వ్రణం బాధతో, చందవోలు నాశనమవుతుందని శపిస్తాడు. అక్కడినుంచి మల్లికార్జునుడు బసవేశ్వరుని దర్శనం కోసం గుంటూరు జిల్లాలోని అమరా రామం మీదుగా నల్లగొండ జిల్లాలోని పానగల్లు చేరుకుంటాడు. పానగల్లును పాలించే రాజు కుందూరు చోడ. ఉదయన రాజు కోశాధికారి అయిన గోవిందప్రగడ ఇంకా రాజుకు పెద్ద లెంక అయిన ధవళేశు నామయ్య ఇద్దరూ కూడా పండితుని శిష్యులైనారు. వారు రాజాజ్ఞకన్నా పండితుని ఆజ్ఞను మన్నించడం మొదలుపెడ్తారు. దాంతో రాజు కోపిస్తాడు. అల్లయ్య, మధుపయ్యలు అనే శివభక్తులను బిజ్జల మహారాజు చంపగా బసవేశ్వరుడు ‘కళ్యాణి నగరం నాశనమగుగాక’ అని శపించాడు.
ముదిగంటి
సుజాతారెడ్డి
99634 31606