నాణేనికి బొమ్మాబొరుసు ఎలాగైతే ఉంటాయో.. ప్రతి విషయంలోనూ మంచి, చెడు అనే రెండు పార్శ్వాలుంటాయి. సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రెండు కోణాలను గమనించవచ్చు. నిద్రపోతున్నప్పుడు మినహా మిగతా సమయంలో ఒక్క పది నిమిషాలు కూడా సామాజిక మాధ్యమాలను చూడకుండా ఉండలేకపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే వాటికి బానిసగా మారుతున్నది.
రంటు, ఫోన్ బిల్, ప్రాపర్టీ టాక్స్, బ్యాంక్ లావాదేవీలు, ఎల్ఐసీ చెల్లింపులు, హోటల్ ఆర్డర్స్, ఆన్లైన్ షాపింగ్, బస్ దగ్గరి నుంచి విమానాల బుకింగ్ల దాకా ఒక్కటేమిటి ప్రతి అవసరం క్షణాల్లో తీరిపోతున్నది. దీంతో సమయం ఆదా అవడమే కాకుండా ప్రత్యక్షంగా వెళ్లే బాధ కూడా తప్పుతున్నది. అదేవిధంగా పెద్ద షాపులు మొదలుకొని తోపుడు బండ్ల వ్యాపారులు సైతం ఆన్లైన్ చెల్లింపులకు అలవాటైపోయారు.
నాణేనికి మరోవైపు అనేకమైన ప్రతికూల అంశాలూ దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి వారి బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. యువతీ యువకులు ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో మోసపోతున్నవారినీ చూస్తున్నాం. విద్యార్థులు దినమంతా ఆన్లైన్ గేమ్లతో గడపడం, అశ్లీల వెబ్సైట్లలో మునిగితేలుతూ చదువులను నిర్లక్ష్యం చేస్తూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మీకు లాటరీ తగిలిందని చెప్పి డబ్బులు వసూలు చేసే బోగస్ సంస్థలు, ఆన్లైన్లో అప్పులిచ్చి ఎక్కువ వడ్డీలు వసూలు చేసే అడ్రసు లేని సంస్థలు, వారికి వడ్డీలు చెల్లించలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో ఉదంతాలనూ చూశాం.
ఈ మధ్య రాజకీయపార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ను వినియోగించుకుంటున్నది. తమ పార్టీ విధి విధానాలను ప్రచారం చేసుకోవడం వరకైతే పర్వాలేదు కానీ ఎదుటి పార్టీ వారిని నిందించడానికి, వారిపై బురద చల్లడానికి, ఆధారాల్లేని అభియోగాలు మోపుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల్లో వాస్తవమేదో అవాస్తవమేదో తెలియకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
కరీంనగర్కు చెందిన పన్నెండేండ్ల ఒక మైనర్ బాలుడు ముఖ్యమంత్రి కేసీఆర్పై అసభ్యకర పోస్టింగులు పెడుతున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం ఈ మధ్యనే వార్తల్లో చూశాం. కొందరికైతే రోజూ సీఎం, పీఎంలను హేళన చేస్తూ పోస్టింగులు పెట్టడం రివాజుగా మారింది. ఇదేమిటని ఎవరైనా అడిగితే మాకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అంటారు. ఉండొచ్చు కానీ విమర్శలు సదుద్దేశంతో ఉండాలి కానీ ఇతరులను కించపరిచేవిధంగా ఉండకూడదు కదా?
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. వీలైతే మనమూ ఏదో ఒకరూపంలో వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. అంతేకానీ నిరంతరం సోషల్ మీడియాలో పనిగట్టుకొని చేసే అభ్యంతరకర పోస్టింగులు మానసికానందాన్ని కలిగిస్తాయేమో కానీ పరిష్కారం మాత్రం దొరకదు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పోస్టులు పెట్టకూడదు. తమ పోస్టుల ద్వారా నేరాలకు పాల్పడే చర్యలను ప్రోత్సహించకూడదు. వ్యక్తిని లేదా ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టింగులు ఉండకూడదు. తమ పోస్టులు లింగ ద్వేషం పెంచేదిగా, ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండరాదు. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకూడదు. చట్టవ్యతిరేక చర్యలను ప్రోత్సహించే, జాతి, మతం, రంగు ప్రాతిపదికగా అవమానించే కంటెంట్ వంటివి పోస్టు చేయడం నేరం.
ప్రతి విషయానికి పాజిటివ్, నెగెటివ్ రెండు కోణాలుంటాయి. కత్తితో ఇంట్లో ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసుకోవచ్చు. ప్రజలు సామాజిక మాధ్యమాల వినియోగంలో ఇమిడి ఉన్న చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లల మీద తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం. చివరగా.. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఎంత మంచిదో, చెడుగా ఉపయోగించుకుంటే కూడా అంతే వేగంగా అథః పాతాళానికి పడిపోవడం ఖాయం. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అని అందుకే అన్నారు పెద్దలు.
(వ్యాసకర్త: ఈఎన్టీ స్పెషలిస్ట్, కోఠి, హైదరాబాద్)
డాక్టర్ , రవిశంకర్ ప్రజాపతి