నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాలలో దోమకొండ ఒకటి. ఇది మెదక్ జిల్లాలో ఉంది. దీనికే ‘బిక్కనవోలు సంస్థానం’ అని పేరు. ఈ సంస్థాన ప్రభువు కామినేని మల్లారెడ్డి ఇబ్రహీం కుతుబ్షా కాలం వాడు. కుతుబ్షా చేత గౌరవ, సత్కారాలు పొందాడు. కామినేని మల్లారెడ్డి ‘షట్చక్రవర్తి చరిత్ర’, ‘పద్మపురాణం’, ‘శివధర్మోత్తర ఖండం’ మొదలైన కృతులను రచించాడు. ఈ కవి శైలి సరళంగా ఉంటుంది. ‘షట్చక్రవర్తి చరిత్ర’లో ఆరుగురు చక్రవర్తుల కథలను శృంగార రస ప్రధానంగా రచించాడు. ఇది ప్రబంధ వర్ణనలతో చక్కని కల్పనలతో రచింపబడింది. శ్లేష శబ్దాలంకార వైచిత్రిని కవి ప్రదర్శించాడు.
‘పద్మపురాణం’లో ఈ కవి రామాయణ కథను చక్కని శైలిలో రచించాడు. శివాభిమాని అయిన ఈ కవి ‘శివధర్మోత్తర కావ్యం’లో శైవ ధర్మాలను వివరించాడు. దీనిలో శైలి సరళంగా ఉంది. మల్లారెడ్డి సోదరుడు కామారెడ్డి. ఈయన ఆస్థానకవి పట్టమెట్ట సోమనాథ సోమయాజి. ఈ కవి ‘సూత సంహిత’ అనే ఏడు ఆశ్వాసాల పద్య గ్రంథాన్ని రచించి కామారెడ్డి ప్రేరణతో సిద్ధ రామేశ్వరునికి అంకితంగా ఇచ్చాడు. ‘బ్రహ్మోత్తరఖండం’ అనే ఐదు ఆశ్వాసాల పద్యకావ్యాన్ని రచించి కామారెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి ప్రోత్సాహంతో సిద్ధరామేశ్వరునికి అంకితంగా ఇచ్చాడు.
మల్లారెడ్డి ‘వాశిష్ఠ వైరాగ్యము’ అనే కావ్యాన్ని రచించాడు. ఆదిపూడి ప్రభాకర కవి ‘కామినేని వంశ చరిత్ర’ను రచించి ఉమాపతి ప్రభువుకు అంకితంగా ఇచ్చాడు. శేషాద్రి రమణకవులు, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ఈ ప్రభువుల ఆదరణను పొందారు. సన్నిధానం వారు రామరాజ భూషణుని ‘నరస భూపాలీయా’నికి ‘కావ్యాలంకార సంగ్రహ’ అనే పేరుతో వ్యాఖ్యానాన్ని, అలంకార శాస్త్ర విషయాలను తేటతెల్లంగా వివరిస్తూ రచించాడు. పెద్ద మందడి వెంకటకృష్ణ కవి ‘రెడ్డి కుల నిర్ణయ చంద్రిక’ను రచించాడు.దో
మకొండ ప్రభువుల ఆస్థానంలో ‘ధూళిపాళ’- ‘నంబాకంకీ’లకు మధ్య తర్క శాస్త్ర చర్చలు; మైసూరు నుంచి వచ్చిన కాశీ సుబ్రహ్మణ్య శాస్త్రి- ఖండవల్లి నరసింహ శాస్త్రికి మధ్య వ్యాకరణ చర్చలు జరిగేవట. దీన్ని బట్టి దోమకొండ ప్రభువుల సాహిత్యాభిమానం తెలుస్తున్నది. దోమకొండ ప్రభువుల గౌరవాన్ని, ఆదరణలను తిరుపతి వేంకట కవులు కూడా అందుకున్నారు.
గోపాలపేట సంస్థానం చిన్న సంస్థానం. ఇది వనపర్తి సంస్థానానికి దగ్గరగా ఉన్నది. ఈ సంస్థానాన్ని సందర్శించిన వాళ్లలో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నాడు. ఈ సంస్థానంలో బుక్కపట్టణం రాఘవాచార్యులు, కేశవపంతుల సింగయ్య, కాకునూరి అప్పకవి ఆశ్రయం పొందారు. కాకునూరి అప్పకవి ‘ఛందోగ్రంథం’ను రచించాడు. అప్పకవి తాత సోమన ‘కాకునూరు’ను అగ్రహారంగా పొందాడు. అందుచేత వారి ఇంటిపేరు కాకునూరు అయింది. అప్పకవి నివాస గ్రామం నవదళపురి అని చెప్పుకొన్నాడు. చాలా రోజుల వరకు పరిశోధకులకు నవదళపురి గ్రామం ఎక్కడుందో తెలియలేదు. కాని ఇది సంస్కృతీకరింపబడిన పేరని తెలుగులో ‘తొమ్మిది రేకుల’ అని తెలిసింది. అదే అప్పకవి నివాస గ్రామం. ఈ గ్రామం పాలమూరు (మహబూబ్నగర్)జిల్లాలో ఉన్నది. దాన్ని బట్టి అప్పకవి తెలంగాణ వాడని స్పష్టమైంది.
అప్పకవి ‘అప్పకవీయం’ పేరుతో ఆంధ్రశబ్ద చింతామణికి పద్య-గద్యాత్మకమైన, వ్యాఖ్యానాత్మకమైన అనువాదం చేశాడు. ఐదు పరిచ్ఛేదాలుగా ఎనిమిది ఆశ్వాసాలుగా 8 ఆర్యలుగా ఈ గ్రంథం విభజింపబడింది. దీనిలో ఛందస్సుల వివరణలతో పాటు యతి, ప్రాసల ప్రామాణిక వివేచన, భాషా అలంకార శాస్త్ర విషయాలు, కావ్య వ్యవహారిక భాషా స్వరూప నిర్ణయం ఉన్నాయి. ఇది ఛందో విషయాలు విశదంగా చర్చించటం చేత ‘ఛందోగ్రంథం’ గా చెప్పబడుతున్నది. ఈ గ్రంథం వివరణలలో వ్యవహారిక భాష ప్రయోగింపబడింది. అప్పకవి ప్రాచీన సాహిత్యం నుంచి 23 మంది కవుల చాటు పద్యాలను, 173 కావ్యాలను, 42 లక్షణ గ్రంథాలను, 339 పద్యాలను ఉదహరించటం అతని పాండిత్య గరిమకు నిదర్శనం. కొన్ని చోట్ల అప్పకవి తాను రచించిన పద్యాలను ఉదాహరణలుగా ఇచ్చాడు. మరికొన్ని చోట్ల పదాలకు వ్యుత్పత్యార్థాలను కూడా చెప్పాడు. ఉదా: ఊచేటి+ఎల= ఊయల అంటాడు. లాలిపాట, పెండ్లిపాట, సువ్వాల పాటలకు అప్పకవి లక్షణాలు చెప్పాడు. కావ్యంలో రసపోషణ ప్రాధాన్యాన్ని గుర్తించాడు. అంతకు ముందు లాక్షణికులు ప్రబంధంలో అష్టాదశ వర్ణనలు ఉండాలని చెప్పగా, అప్పకవి వాటిని 22 వరకు పెంచాడు. కాని, అప్పకవి ‘ఆంగ్రీభవుని కావ్యము గ్రాహ్యము కాద’ంటూ అనటం అతని ఛాందస భావాలకు నిదర్శనం.
ముదిగంటిసుజాతారెడ్డి
99634 31606