మన శరీరంలోని రక్తం అనేక పదార్థాల మిశ్రమం. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టే, ఆ ఎరుపు రంగు. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందించి, కార్బన్-డై-ఆక్సైడ్ను ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. శరీరంలో ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ తగ్గడమే ‘రక్తహీనత’. దీన్నే ‘ఎనీమియా’ అంటారు. రక్తహీనతను తొలిదశలో గుర్తించడం కష్టమే. కానీ ఆ ప్రభావం శరీరంపైనా, మెదడుపైనా తీవ్రంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మందగించడం, మాటలు సరిగా రాకపోవడం, గణితంలో ప్రావీణ్యత తగ్గడం.. ఆ లక్షణాలే. శారీరకంగా అలసట, ఆకలి తగ్గడం, ఆట-పాటలలో వెనుకబడటం, వ్యాధి నిరోధకత సన్నగిల్లడం.. తదితర సంకేతాలను కన్నవాళ్లు అర్థం చేసుకోవాలి. అంటు వ్యాధులు చాలావేగంగా తీవ్రస్థాయికి చేరే ఆస్కారం ఉంటుంది. ఆ తరువాత వైద్యం చేసినా దుష్ప్రభావాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మన దేశంలో 25-40 శాతం పిల్లలు వివిధ వయసులలో రక్తహీనతకు గురవుతున్నారు. దీంతో కండ్లు, గోళ్ళు తెల్లగా మారుతాయి. ఆకలి బాగా తగ్గిపోతుంది. మట్టి, సున్నం, కాగితాలు, బలపాలు, చాక్పీస్లు తింటూ ఉంటారు. పాలు తాగడానికి ఆసక్తి చూపుతారు.
కారణాలు: ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం, మితిమీరిన పాల వినియోగం వల్ల ఘన పదార్థాలు తగ్గుతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 లేకపోవడం ప్రధాన కారణాలు. వీటితోపాటు జంక్ఫుడ్స్ తినడం, శీతల పానీయాలు తాగడం, కడుపులో నులి పురుగులు కూడా కారణాలే.
నివారణ: ఐరన్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు, ఎండు ఫలాలు, దానిమ్మ, చిక్కుళ్లు, మాంసాహారం తీసుకోవాలి. ఒక్క సమతులాహారంతోనే సమస్యను పరిష్కరించలేం. పిల్లలందరికీ ఐరన్ మందులు ఇవ్వాల్సిన అవసరముంది. భారత ప్రభుత్వం ‘ఎనీమియా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా వారానికి రెండుసార్లు.. ఆరు నెలల వయసు నుంచి ఐదు సంవత్సరాల వారికి ఐరన్ సిరప్, 6-19 సంవత్సరాల వారికి ఐరన్ మాత్రలు ఇస్తారు. దీంతోపాటు సంవత్సరానికి రెండుసార్లు ఆరు నెలల వ్యత్యాసంతో నులి పురుగుల మందు ఇవ్వాలి. ఐరన్ సిరప్ ఆహారానికి ముందు ఇస్తే ఒంటికి బాగా పడుతుంది. సిరప్ వల్ల పళ్లు తాత్కాలికంగా రంగు మారకుండా, నీటితో పుక్కిలించి మింగాలి. మలం కూడా తాత్కాలికంగా నల్లరంగులో ఉంటుంది. అయినా, భయపడాల్సిన పన్లేదు.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు