రంగునీళ్లను పొడవాటి ప్యాకెట్లో పోసి గడ్డకట్టించి చేసే ఐస్ పాప్సికల్స్ను తినే ఉంటాం. ఈ చల్లటి మిఠాయి కోసం సైకిల్ చుట్టూ చేరే ఉంటాం. ఆ తీపి జ్ఞాపకాన్నే వ్యాపార ఆలోచనగా చేసుకున్నారు అనుజ కాబ్ర. దాన్ని అయిదు కోట్ల రూపాయలకుపైగా టర్నోవర్ కలిగిన కంపెనీగా తీర్చిదిద్దారు కూడా. అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే..
నోస్టాల్జియా… చిన్నప్పుడు తిన్న పదార్థాలు, వాడిన వస్తువులను మళ్లీ ఇప్పుడు చూడటంలోని ఆనందమే వేరు. అదే అనుభూతిని మా స్కిప్పీ సంస్థ అందించే ఐస్ పాప్సికల్స్ ద్వారా పొందుతున్నారు చాలామంది. భారత్లో ఈ తరహా ఉత్పత్తిని అందిస్తున్న తొలి సంస్థ మాదే. అంతేకాదు, దీన్ని నెలకొల్పడంలో ఎదురైన శ్రమా ఎక్కువే. విదేశాల్లో స్థిరపడిన మేము ఇండియాకు రావడానికి, వచ్చాక పాప్సికల్స్ సంస్థ ప్రారంభించడానికీ వెనక ఓ కథ ఉంది. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. రాజ్భవన్ రోడ్లోని విల్లామేరీ కాలేజీలో చదువుకున్నాను.
మా వారు రవిది కూడా హైదరాబాదే. పెండ్లి తర్వాత కొంతకాలానికి ఆస్ట్రేలియా వెళ్లిపోయాం. అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. కానీ 2019లో మాకు పిడుగులాంటి వార్త అందింది. మా మామగారికి క్యాన్సర్ అని తెలిసింది. దీంతో స్వదేశానికి తిరిగిరావాలని నిర్ణయించుకున్నాం. అయితే హైదరాబాద్కు వెళ్లాక ఏం చేయాలనే స్పష్టత లేదు. ఇద్దరం ఆలోచనలో పడ్డాం. అదే సమయంలో మా ఆడబిడ్డ ఆస్ట్రేలియా వచ్చి ఇండియాకు వెళుతున్నారు.
తనతోపాటు కొన్ని ఐస్ పాప్సికల్స్ సర్దుకున్నారు. అది చూసిన మేం ఆశ్చర్యపోయాం. ‘ఇవెందుకు?’ అని అడిగాం. ‘నాణ్యతతో ఉన్నాయి. రుచి కూడా బావుంది. అక్కడ దొరకట్లేదు’ అన్నారామె. ఇదేదో మంచి బిజినెస్ ఐడియాలా అనిపించింది. అయితే, తయారీకి సంబంధించి అధ్యయనం చేశాం. మెషీన్ల కోసం వెతికాం. మరీ ముఖ్యంగా, కృత్రిమ రంగులు వద్దనుకున్నాం. తయారీ, నిల్వ… ఇలా రకరకాల కోణాల్లో పరిశోధించాం.
మా దగ్గర ఉన్న సుమారు 50 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాం. 2020 మార్చిలో ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువద్దామని అనుకున్నాం. అంతలోనే లాక్డౌన్ మొదలైంది. దాంతో అద్దెలు, జీతాలు, ప్లాంట్ నిర్వహణ భారమైపోయాయి. ఏడాది కాలం స్తబ్ధుగా గడిచిపోయింది. 2021 మార్చిలో మళ్లీ పనిమొదలుపెట్టాం. పెరిగే డిమాండ్ను బట్టి జనానికి మా ఉత్పత్తి నచ్చుతున్నదని అర్థమైంది. అదే సమయంలో, స్టార్టప్లకు ఆర్థిక దన్ను అందించే షార్క్ట్యాంక్ ఇండియా ప్రోగ్రామ్లో పాల్గొనే అవకాశం దొరికింది. మా ఐడియా ఇన్వెస్టర్లకు ఎంతో నచ్చింది. ఏకంగా కోటి రూపాయల పెట్టుబడి దొరికింది.
మా పిల్లలూ తినగలిగేలా…
ఈ సంస్థను ప్రారంభించినప్పుడే నేను, మా ఆయన ఒక మాట అనుకున్నాం. ‘మనం మన పిల్లలు తినడానికి ఇవ్వగలిగేలా తయారు చేయాలి’ అని నిశ్చయించుకున్నాం. అందుకే మా ఉత్పత్తుల్లో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ ఉపయోగించం. ప్రకృతిసిద్ధంగా లభించే రంగులను వినియోగిస్తాం. ఉదాహరణకు మ్యాంగో ఫ్లేవర్ తయారీలో రంగు కోసం పసుపు వాడతాం. రెస్ప్బెర్రీ కోసం బీట్రూట్ వర్ణాన్ని తీసుకుంటాం. వీటి తయారీకి కొన్ని సంస్థలతో టైఅప్ పెట్టుకున్నాం. వాళ్ల దగ్గర క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకుంటాం. ఇందులో వాడే నీళ్లు కూడా పూర్తి శుద్ధమైనవి.
కోలా, నిమ్మ, ఆరెంజ్, బబుల్గమ్లాంటి ఫ్లేవర్లలో వీటిని తయారుచేస్తున్నాం. షార్క్ట్యాంక్ కార్యక్రమంతో మాకు పెట్టుబడితోపాటు మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్లోనే 1500 అవుట్లెట్లలో మా ఉత్పత్తులున్నాయి. నెలకు 8 లక్షల దాకా పాప్సికల్స్ అమ్ముడవుతున్నాయి. అన్ని రాష్ర్టాల్లోనూ మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తున్నది. కెనడా, కువైట్, సౌదీలాంటి ఏడు దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నాం.
మా ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇటీవలే ఫ్రీజర్ బైక్ మార్కెట్లోకి తెచ్చాం. బండితోపాటే ఫ్రీజర్ వచ్చే ఇలాంటి వంద ఎలక్ట్రిక్ బైకుల్ని కొంటున్నాం. వీటితో పాప్సికల్స్ కరిగిపోయే ఇబ్బంది ఉండదు. ఇక, మా ప్లాంట్లలో యాభైశాతానికి పైగా మహిళలనే నియమించుకుంటున్నాం. గతంలో అనుభవం లేకపోయినా, శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిస్తున్నాం. మరిన్ని దేశాలకు మా ఉత్పత్తులను పంపాలని, భారత క్రికెట్ జట్టు జెర్సీ మీద స్కిప్పీ సంస్థ పేరు కనిపించాలనీ నా ఆశ. దాన్ని నెరవేర్చుకునే దిశగా మరింత నిబద్ధతతో పనిచేస్తున్నాం.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి