Diet | ఇటీవల రకరకాల డైట్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అన్నం పూర్తిగా నిషేధిస్తున్నారు. కూరగాయలు, పండ్ల ముక్కలు, కొబ్బరి, పల్లీలాంటివి మాత్రమే తింటున్నారు. ఈ తరహా భోజన విధానం ఎంతవరకు మంచిది?
– ఓ పాఠకురాలు
ఏ డైట్ పాటించినా మనం తినే ఆహారం సమతులంగా ఉండేలా చూసుకోవాలి. కార్బొహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్లు, కొవ్వులు.. ఈ అయిదు విభాగాలనూ మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అందుకోసం భిన్న ఆహార పదార్థాల కలయికగా రోజువారీ భోజనాన్ని సిద్ధం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రస్తావించిన డైట్లో అన్నం లేదు. మన దృష్టిలో.. పాలిష్ పట్టిన తెల్లటి బియ్యంతో వండిందే అన్నం. వరి గింజల పైపొరలో ఉండే పోషకాలన్నీ పోతాయి కాబట్టి దాన్ని వదిలేయొచ్చు. కానీ ఆ స్థానంలో దంపుడు బియ్యం, సింగిల్ పాలిష్ బియ్యం, బ్రౌన్రైస్ లాంటివి తీసుకోవాలి.
అది కాకపోతే కొర్రలు, జొన్నలు, సజ్జల్లాంటి చిరుధాన్యాలు, క్వినోవాలాంటి వాటితో చక్కగా అన్నం చేసుకోవచ్చు. అదనంగా కూరగాయల ముక్కలు, మక్కజొన్న, వేరుశనగ గింజలు, పండ్ల ముక్కలు జోడించు కోవచ్చు. అంతే కానీ, పూర్తిగా అన్నాన్ని విస్మరిస్తే మాత్రం మన శరీరానికి కావలసిన కార్బొహైడ్రేట్లు అందవు. అలాంటప్పుడు అది సమతులాహారం కాలేదు. కాబట్టి, ఏ డైట్ పాటించినా అందులో అన్ని పోషకాలూ ఉండేలా చూసుకోవాలి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com