హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కరోనా విపత్తు జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చేసింది. ‘కరోనాకు ముందు.. ఆ తర్వాత’ అని విభజిస్తే ఆర్థిక అంశాల్లో, ముఖ్యంగా సంపాదన, ఖర్చుల తీరుతెన్నుల్లో అనేక మార్పులను తీసుకొచ్చింది. ఇటీవల విడుదలైన అనేక సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రత్యేకించి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవన ‘వ్యయ’ విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ప్రతిదానికి ‘ఆన్లైన్ ఆర్డర్’ అందుబాటులోకి రావడంతో అది నిత్యజీవితంలో భాగంగా మారింది. ఫుడ్ ఆర్డర్ సర్వ సాధారణంగా కనిపిస్తున్నది. డ్రైఫ్రూట్స్, ఫ్లోర్ క్లీనర్లు, శానిటైజర్లు, మాస్కులు నిత్యావసరాల జాబితాలోకి చేరాయి. వీటికోసం నెలకు రూ.1,000 వరకు వెచ్చిస్తున్నారు. ఆ మేరకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఈ మార్పు మన కు తెలియకుండానే జీవితంలో భాగమైంది. గత నాలుగైదు నెలల్లో జీవన విధానాన్ని పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా అర్ధమవుతుంది.
విద్యుత్ వాహనాలవైపు మొగ్గు
కరోనా తర్వాత విద్యుత్ వాహనాలవైపు (ఈవీ) మొగ్గు చూపేవారి సంఖ్య పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణం. ఈవీలతో ఖర్చు తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు. వీటిని కొనుగోలు చేస్తామని ఇటీవల ‘మొబిలిటీ కన్సూమర్ ఇండెక్స్’ పేరుతో ఈవై కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు వాహనం ధరలో 20 శాతం డౌన్ పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని 40 శాతం మంది, పర్యావరణాన్ని కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావించి ఈవీని కొనుగోలు చేస్తామని 67 శాతం మంది చెప్పారు.
ఇంటికో ఎమర్జెన్సీ ఫండ్
ఆరోగ్య విపత్తు ఒకేసారి వచ్చి పడుతుందని కరోనా గుణపాఠం నేర్పింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే కచ్చితంగా కుటుంబానికి అత్యవసర నిధి ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నా కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయవని, ఎమర్జెన్సీ ఫండ్ను కూడబెట్టుకోవడమే ఏకైక మార్గమని చాలా మంది అనుకుంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 2,000 మంది పాల్గొనగా.. ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఏర్పాటు చేస్తున్నట్టు 90 శాతం మందికిపైగా ముక్తకంఠంతో చెప్పారు. సంపాదనలో కొంత మొత్తాన్ని పక్కన పెడుతున్నట్లు 51 శాతం మంది.. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నామని మిగతావారు తెలిపారు.
ఆఫర్లకే మొగ్గు
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ షాపింగ్లో ఆఫర్లవైపే వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. బిల్లులో కనీసం 10 శాతం తగ్గినా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చన్న భావన పెరిగింది. దీనికి తగ్గట్టు అన్ని విభాగాల కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులు ఎక్కువగా ‘క్యాష్ బ్యాక్’ ఆఫర్లకే మొగ్గు చూపుతున్నట్లు ఓ అంతర్జాతీయ సర్వే స్పష్టం చేసింది. ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ లేదా ‘కాంబో ప్యాక్’ లాంటి ఆఫర్ల కంటే బిల్లులో డిస్కౌంట్ కావాలని 60 శాతం మంది కోరుకొంటున్నట్లు వెల్లడించింది.
ఇంట్లోనే హోటల్ భోజనం
కరోనాకు ముందు నెలకు కనీసం ఒకటి రెండుసార్లు హోటల్కు వెళ్లి భోజనం చేసేవారు. ఓవైపు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు పెరగడం.. మరోవైపు కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంట్లోనే హోటల్ ఫుడ్ను తినడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు, టేక్-అవేలు పెరిగాయి. ఇటీవల ఓ సంస్థ దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో నిర్వహించిన సర్వేలో 61 శాతం మంది టేక్ అవే లేదా హోమ్ డెలివరీ వైపై మొగ్గు చూపారట. ఇదే సంస్థ 2017-18లో నిర్వహించిన సర్వేలో 75 శాతం మంది రెస్టారెంట్లకు వెళ్లి తినడానికే మొగ్గుచూపారట. తాజా సర్వేలో 51 శాతం మంది ప్రొటీన్ ఫుడ్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్టు చెప్పారు.
డ్రైఫ్రూట్స్కు ఆదరణ..
ప్రపంచవ్యాప్తంగా గత రెండేండ్ల నుంచి డ్రైఫ్రూట్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. కరోనా సోకినవారికి పోషకాహారంగా కాజు (జీడిపప్పు), బాదాం, కిస్మిస్, పిస్తా లాంటి డ్రైఫ్రూట్స్ ఇచ్చారు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రజలు గుర్తించారు. దీంతో దాదాపు అన్ని కుటుంబాల నిత్యావసరాల్లో డ్రైఫ్రూట్స్ చేరాయి. ప్రొటీన్ కోసం మాంసం వినియోగం కూడా పెరిగింది. ఫలితంగా ఇతర అవసరాలను తగ్గించుకొని వీటికి బడ్జెట్ కేటాయిస్తున్నారు. మరోవైపు చిరుతిళ్ల కన్నా తాజా పండ్లు, కూరగాయలు తినడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్టు ఓ సర్వేలో 38% మంది స్పష్టం చేశారు. పాల ఉత్పత్తులు తిసుకుంటున్నామని 24% మంది చెప్పారు.