పచ్చని అడవి తొలిగురువు. పరిసరాలు మరో గురువు. కంటికి కనిపించిన దృశ్యాన్ని, మనసుకు హత్తుకున్న సన్నివేశాన్ని మనోహరమైన చిత్తరువుగా క్షణాల్లో గీస్తాడు ఇస్రం ప్రేమ్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్కు చెందిన ఈ యువకుడు చిత్రలేఖనంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. బొమ్మలు గీయడంపై ఇష్టంతో ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేశాడు. ఎక్కడెక్కడికో వెళ్లి.. నిష్ణాతుల దగ్గర శిక్షణ పొందాడు. సీనియర్ల సలహా మేరకు జేఎన్టీయూ ఫైన్ఆర్ట్స్ కోర్సులో చేరి తన కళకు మెరుగులు దిద్దుకున్నాడు. పోర్ట్రయిట్ ఆయిల్ పెయింటింగ్లో నైపుణ్యం పొందాడు. ప్రేమ్ చిత్రాల్లో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. గ్రామీణ వాతావరణం పంచవన్నెల్లో పల్లవిస్తుంది.
గ్రామీణ జీవన చిత్రం సహజంగా ప్రతిఫలిస్తుంది. పల్లె అందాలతో ప్రేమ్ ప్రాణంపోసిన 24 చిత్రాలతో ఇటీవల హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ యువ చిత్రకారుడి ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయారు. ‘చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కళను నమ్ముకొని ఇంతదూరం వచ్చాను. మారుమూల పల్లెలో పుట్టిన నేను, నా కళ ద్వారా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటాడు ప్రేమ్.