అది ఒకప్పుడు రాజభవనమే ! 1912 కాలంలో ఓ సంపన్నుడు దాన్ని నిర్మించాడు. హలాలా కండా అని పిలిచే ఆ భవంతి అప్పట్లో ఎందరో ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియో చక్రవర్తి హేలీ సెలస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కేథ్ మిల్లర్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ బంగ్లాలో విడిది చేసి పచ్చటి ప్రకృతిని ఆస్వాదించి వెళ్లేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కాలం మారుతున్న కొద్దీ ఆ బంగ్లా వైభవం తగ్గిపోయింది. పట్టించుకునేవారు లేకపోవడంతో పాడుబడి శిథిలావస్థకు చేరుకుంది. అడవిలో బూతుబంగ్లాగా మిగిలిపోయింది. అలాంటి సమయంలో నలుగురు స్నేహితుల కంటపడింది ఈ బంగ్లా. వందేండ్ల చరిత్ర కలిగిన ఈ భవనాన్ని తమ సొంతం చేసుకున్నారు. శ్రీలంకలోని వెలిగామ పట్టణానికి సమీపంలో కొండప్రాంతంలో నిర్మించిన ఈ సౌధాన్ని 2011లో దాదాపు రూ.2కోట్లు పెట్టి దక్కించుకున్నారు.
ఆ నలుగురు స్నేహితులు హలాలా కండా బంగ్లాను సొంతం చేసుకునే సమయానికి దాని వైభవం మొత్తం పోయింది. గోడలు పాడైపోయాయి. భవనం మొత్తానికి బూజు పట్టింది. గబ్బిలాలకు ఆ బంగ్లా ఆవాసంగా మారిపోయింది. ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు పెరిగి భవనం పైకప్పులోకి దూసుకెళ్లాయి. అయినా సరే ఇంటీరియర్ డిజైనర్ అయిన శార్ప్, అతని స్నేహితులు జెన్నీ లెవిస్, రిచర్డ్ బ్లీస్డేల్, బెంట్లీ డి బేయర్ ఆ బంగ్లాను ఇష్టపడ్డారు. దాన్ని కొనుగోలు చేసి మళ్లీ ఆ బంగ్లాకు పునర్వైభవం తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2012 డిసెంబర్లో ఆ బంగ్లా పునర్నిర్మాణ పనులను మొదలు పెట్టారు. చారిత్రాత్మకత దెబ్బతినకుండా ఇప్పటి అధునాతన సౌకర్యాలు ఉండేలా ఆ బిల్డింగ్ రెనొవేషన్ పూర్తి చేశారు. అంతేకాకుండా గార్డెన్లో 23 మీటర్ల పొడవుతో ఒక నీటి కొలనును ఏర్పాటు చేశారు. అద్భుతంగా మార్చి పునర్వైభవం తీసుకొచ్చారు.
బంగ్లాకు పునర్వైభవం తీసుకురావడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు దాన్ని ఆ నలుగురు స్నేహితులు రిసార్ట్గా మార్చేశారు. ఐదు బెడ్రూంలతో అందంగా ఉన్న ఈ భవంతిలో 12 మంది బస చేయవచ్చు. ఈ రిసార్ట్కు ఒక మేనేజర్, చెఫ్, ఇద్దరు సర్వీస్ స్టాఫ్, ఇద్దరు గార్డెనర్లు, ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈ రిసార్ట్లో ఒక రాత్రి గడపాలంటే దాదాపు రూ. లక్ష (1300 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది.