పుస్తకం అంటే ముఖ పుస్తకం కాదు. అదొక ఆస్తి, సంస్కృతి, వారసత్వం. అన్నిటికీ మించి గొప్ప స్పర్శ. మనలో చాలామంది పుస్తక సంస్కృతికి దూరంగా బతుకుతున్నారు. దాశరథి, కాళోజీ, శ్రీశ్రీ, గురజాడ, జాషువా లాంటి సాహిత్య దిగ్గజాలను కూడా మర్చిపోతున్నారు. పుస్తకాన్ని, సాహిత్యాన్ని మర్చిపోతే సంస్కృతినీ మర్చిపోయినట్టే. పుస్తకం అంతరించిన వస్తువు కావద్దంటే ఒకసారి ‘కితాబ్ ఘర్’ను సందర్శించాల్సిందే.
నేటి తరానికి సాహిత్యాన్ని పరిచయం చేసేదే ‘కితాబ్ ఘర్’. ఇంటినే సాహిత్య వేదికగా మార్చి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు కవయిత్రి షాజహానా. ఇక్కడ మనం చదివిన పుస్తకాలను ఇచ్చి, చదువని పుస్తకాలను తీసుకెళ్లవచ్చు. హైదరాబాద్ మణికొండలోని హుడా కాలనీలో ఉందీ పుస్తక నిలయం. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకు ద్వారాలు తెరిచే ఉంటాయి.