స్టేషన్ బెయిల్ అంటే?జీరో ఎఫ్ఐఆర్ అంటే?ఈ ప్రశ్నలు సామాన్యులను అడిగితే సమాధానం ‘ఏమో..! తెలీదు’ అనే వస్తుంది. చట్టం ఒక్క ఫోన్కాల్ దూరంలో ఉన్నా చాలామంది స్టేషన్ తలుపు తట్టడానికి సంకోచిస్తారు. ఈ విషయంలో ఆడవాళ్లయితే మరింత భయపడతారు! పల్లెపడుచులు, పట్నాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైతం.. ఆపదలోనూ పోలీసులను ఆశ్రయించడానికి వెనుకంజ వేస్తారు. కారణం చట్టంపై అవగాహనా లేమి. న్యాయవ్యవస్థను ఎలా సంప్రదించాలో తెలియనితనం. మహిళల హక్కులు, వారి కోసం ప్రత్యేకంగా చేసిన చట్టాలను ఒక్క దగ్గరకు చేర్చి ‘పింక్ లీగల్’ వేదికగా అవగాహన కల్పిసున్నారు లాయర్ మానసి చౌదరి.
మానసి తండ్రి శంతన్ చౌదరి ఆర్కిటెక్ట్. తల్లి మధుర చౌదరి హోమియోపతి డాక్టర్. వారిది మరాఠీ కుటుంబం. మానసి పుట్టింది మహారాష్ట్రలో. కానీ, పెరిగిందంతా హైదరాబాద్లోనే. మానసి తాతయ్య ముంబయి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్నప్పుడు అడపాదడపా తాతయ్యతో కోర్టుకు వెళ్లేది. అక్కడ లాయర్ల వాదప్రతివాదనలు చాలా ఆసక్తిగా అనిపించేవి ఆమెకు. ఇంటికి వచ్చాక కూడా కోర్టు సీన్లు ఆమె మనసు తెరపై కదలాడుతూనే ఉండేవి. దీంతో పెద్దయ్యాక లాయర్ కావాలని ఆనాడే నిర్ణయించుకుంది మానసి. ఇంటర్ తర్వాత ఢిల్లీలో ‘జిందాల్ గ్లోబల్ లా స్కూల్’లో బీఏ ఎల్ఎల్బీ చేసింది. హైదరాబాద్కు వచ్చి హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్ ఎస్.నిరంజన్రెడ్డి దగ్గర మూడేండ్లు ప్రాక్టీస్ చేసింది. 2018లో మళ్లీ ఢిల్లీకి వెళ్లి జస్టిస్ చంద్రచూడ్ ఆఫీస్లో కొన్ని నెలలు పనిచేసింది. ఆ సమయంలోనే ఆర్టికల్ 377, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కేసుల్లో రీసెర్చ్, ఫైలింగ్ వర్క్లో పాలుపంచుకుంది మానసి. 2019లో తిరిగి హైదరాబాద్కు వచ్చి కార్పొరేట్ అండ్ రియల్ఎస్టేట్ అడ్వకేట్గా ‘ఎంసీ లీగల్’ పేరుతో సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నది.