గడ్చిరోలి ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్
మహారాష్ట్ర సరిహద్దు వెంట గట్టి నిఘా
ప్రాణహిత తీరాన్ని జల్లెడ పడుతున్న ప్రత్యేక బలగాలు
సరిహద్దు మండలాల్లో విస్తృత తనిఖీలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/దహెగాం, మే 21 : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు చనిపోయిన సంఘటన నేపథ్యంలోకుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రాణహిత తీరంతోపాటు అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రాణహిత నదిని దాటి వచ్చే వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. ప్రాణహిత తీరంలో ఉన్న బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్, కౌటాల, దహెగాం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర నుంచి ప్రాణహిత తీరం దాటుకొని జనాల రాకపోకలు దాదాపుగా తగ్గిపోయాయి. అయినప్పటికీ పోలీసులు ప్రాణహిత సరిహద్దుల వెంట గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గడ్చిరోలి ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రాణహిత తీరం వెంట జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. ప్రాణహిత తీరాన్ని, అటవీ ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు.
జిల్లాలో గతేడాది మావోయిస్టు భాస్కర్ బృందం కోసం మూడు నెలల పాటు పోలీసులు ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబర్ 19న కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. అప్పటి నుంచి భాస్కర్ బృందం కోసం పోలీసులు జిల్లాలో కూంబింగ్ మరింత ముమ్మరంగా చేపడుతున్నారు. కదంబా ఎన్కౌంటర్ తరువాత జిల్లాలో మావోయిస్టు సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఎన్కౌంటర్ తరువాత మావోయిస్ట్ భాస్కర్ బృందం మహారాష్ట్రకు వెళ్లినట్లు పోలీసు నిఘా వర్గాలు ధ్రువీకరించుకున్నాయి. తాజాగా గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ప్రారంభించారు. ప్రాణహిత బార్డర్తోపాటు, అటవీ ప్రాంతాలను, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.
దహెగాం మండలంలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో పోలీస్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసులు సుమారు 150 మంది ప్రాణహిత నది సరిహద్దు ప్రాంతం మొట్లగూడ, దిగడ, రాంపూర్, రావులపల్లి అటవీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా సరిహద్దు జెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలతో పాటు మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.