వేమనపల్లి, మే 11 : వేమనపల్లి మండల కేంద్రంలో మంగళవారం సర్పంచు కుబిడె మధుకర్ పంచాయతీ కార్మికుల చేత హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో గ్రామం మొత్తం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించినట్లు తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖానికి మాస్కులను ధరించాలని సూచించారు.
దండేపల్లి మండలం తాళ్లపేటలో..
దండేపల్లి, మే11 : కరోనా వైరస్ను అరికట్టడానికి మండలంలోని తాళ్లపేట జీపీలో మంగళవారం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో నలుగురు కరోనా బారిన పడి చనిపోవడంతో జీపీ సిబ్బంది అప్రమత్తమై పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి కొవిడ్ వైరస్ ప్రభావాన్ని ప్రజలకు వివరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని గ్రామస్తులకు వివరించారు.
కోటపల్లి మండలం పంగిడి సోమారంలో..
కోటపల్లి, మే 11 : కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు సర్పంచ్ తులసి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
పారిశుధ్య, క్లోరినేషన్ పనులు
చెన్నూర్, మే 11 : కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా చెన్నూర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య, క్లోరినేషన్ పనులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో మంగళవారం పారిశుధ్య పనులతో పాటుగా క్లోరినేషన్ పనులు చేపట్టారు. మురుగు కాలువల్లోని పూడిక తొలగించారు. రోడ్లపై చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. పారిశుధ్య పనులు నిర్వహించిన అనంతరం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైన కాలనీల్లో ప్రత్యేక దృష్టి సారించి క్లోరినేషన్ పనులు చేస్తున్నారు. పారిశుధ్య, క్లోరినేషన్ పనుల ను కమిషనర్ ఖాజా మొయిజొద్దీన్ పర్యవేక్షించారు.