కాగజ్నగర్టౌన్ , మే 11 : కొవిడ్ మహమ్మారి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే ముగిసింది. పట్టణంలోని 30 వార్డుల్లో 30 బృందాలు ఇంటింటా తిరుగుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసి మందులు అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ భరోసా కల్పించారు.
30 బృందాల ఏర్పాటు..
పట్టణంలో 30 వార్డుల ఉండగా, 30 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ప్రతిరోజూ 50 ఇండ్లను అప్పగించారు. ఇందులో ఏఎన్ఎం, ఆశ వర్కర్, మున్సిపల్, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వీరు 13,660 ఇండ్లలోని 14,734 మంది కుటుంబ సభ్యులను థర్మల్ స్క్రీనింగ్తో పరీక్షించి సర్వేను చేపట్టారు. మూడు వార్డులకు ఒక మున్సిపల్ అధికారిని సూపర్వైజర్గా నియమించి ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేశారు. 449 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మందుల కిట్లు అందజేసి సలహాలు సూచనలు ఇచ్చారు. జ్వరంతో బాధపడుతున్నవారిని హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటా సర్వే పూర్తిచేశాం.30 వార్డుల్లో 14,734 కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుని లక్షణాలు ఉన్న 449 మందికి మందులను పంపిణీ చేశాం. వీరికి మరోసారి పరీక్షలు చేస్తాం. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలి.మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలి.
-శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్