భైంసా, ఏప్రిల్ 12: బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఏఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 68, 69 జీవో ప్రకారం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, మాస్కు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కరోనా సెకండ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని సోమవారం జరిగే సంతను తాత్కాలికంగా బంద్ చేయడం జరిగిందన్నారు. పోలీస్స్టేషన్ నుంచి కుభీర్ చౌరస్తా వద్ద, బస్టాండ్ వరకు గల ఫుట్పాత్లపై బండ్లు, చిరువ్యాపారులు రోడ్డుపైకి రావద్దని సూచించామని, ఇప్పటికే వారితో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. మాస్కులు ధరించినవారికే సరుకులు ఇవ్వాలని దుకాణా యజమానులకు సూచించారు. బస్టాండ్ ఎదుట తోపుడు బండ్లను నిలుపరాదని, నిలిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పల్లె ప్రజల సౌకర్యార్థం వారు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి సాయంత్రం 7గంటల వరకు సడలించామని తెలిపారు. రానున్న రంజాన్ మాసంలో ముస్లింలు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక దూరం పాటిస్తూ బండ్లను నెలకొల్పుకోవాలని సూచించారు. ఇప్పటికే వారితో సమావేశం నిర్వహించామని చెప్పారు. 7గంటల తర్వాత ఇండ్ల ఎదుట అరుగులపై కూర్చొని ఉన్నా, ద్విచక్రవాహనాలపై తిరిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ వేణుగోపాల్రావు తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
IPL 2021:రాహుల్ అర్ధశతకం.. హుడా సిక్సర్ల వర్షం