కారులో తరలిస్తుండగా 400 ప్యాకెట్లు స్వాధీనం
రూ. 3 లక్షల విలువైన 1.80 క్వింటాళ్లు సీజ్
వివరాలు వెల్లడించిన ఏసీపీ నరేందర్
అనుమతి లేని విత్తనాలను కొనవద్దంటూ రైతులకు సూచన
కోటపల్లి, ఏప్రిల్ 6 : ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ నరేందర్ హెచ్చరించారు. రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద 400 ైగ్లెసిల్ విత్తనాల ప్యాకెట్లను పట్టుకోగా కోటపల్లి పోలీస్ స్టేషన్లో చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజుతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వివరాలను వెల్లడించారు. మండలంలోని రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద కోటపల్లి ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎంహెచ్ 35 1959 అనే కారులో తరలిస్తున్న నిషేధిత పత్తి విత్తనాలను గుర్తించారు. మనోజ్ శేషరావ్ లోలుసరే, నితిన్ ప్రకాశ్ మహంట్ను విచారించగా వారి వద్ద ఎలాంటి బిల్లులు, విత్తనాల ప్యాకెట్లపైన లేబిల్లింగ్ లేవు. మొత్తం 450 గ్రాముల బరువు గల 400 ప్యాకెట్లు (1.80 క్వింటాళ్లు) పట్టుకున్నారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. పట్టుకున్న విత్తనాలను కోటపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిగా మహేందర్కు అప్పగించినట్లు తెలిపారు. లైసెన్స్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రభుత్వ అనుమతి లేని, బిల్లులు లేని విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఏసీపీ సూచించారు. నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కోటపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, ట్రైనీ ఎస్ఐ జ్యోత్స్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..