ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది కార్మికులు వాగులో చిక్కుకుపోయారు. పెదవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు వాగు ఒడ్డున శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా వాగులో వరద ప్రవాహం పెరగడంతో కార్మికులు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని నీరు చుట్టుముట్టింది. దీంతో కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సినవారు కంట్రోల్ రూం నంబర్ 18004251939లో సంప్రదించాలని సూచించారు. ఉట్నూరు, నేరడిగొండ, బోథ్లో రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలు ప్రారంభించారు. నిర్మల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నిర్మల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నంబర్ 790628368ను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.