డిసెంబర్ కోటా 2905 మెట్రిక్ టన్నులు
ఒకటో తేదీ నుంచి అందించేందుకు ఏర్పాట్లు
సర్కారు నిర్ణయంతో రేషన్కార్డుదారుల హర్షం
మార్చి వరకు కొనసాగించే అవకాశం
మంచిర్యాల అర్బన్, నవంబర్ 27 : కరోనా ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. తాజాగా ఉచిత బియ్యం పంపిణీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో లబ్ధిదారులకు మరింత ఊరట కలిగినైట్లెంది. మరోవైపు ఈ ఉచిత బియ్యం పంపిణీ మరో నాలుగు నెలలు కొనసాగే అవకాశాలున్నాయని సివిల్ సప్లయ్ కార్యాలయ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పేద వర్గాలకు భరోసా..
ఉచిత బియ్యం పంపిణీ పేద ప్రజలకు భరోసానిస్తున్నది. కరోనా సమయంలోనే దొడ్డు బియ్యానికి తోడు సన్న బియ్యం కూడా పంపిణీ చేసింది. గడిచిన కొన్ని నెలలుగా సన్న బియ్యం ఇస్తుండడంతో రేషన్ కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా అందుబాటులో ఉన్న సన్న బియ్యం, దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్లకు వచ్చే కోటాను బట్టి కొంత సన్న బియ్యం, మరికొంత దొడ్డు బియ్యం అందజేస్తూ వస్తున్నారు. మరోవైపు డిసెంబర్ కోటాకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు.
ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున..
ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తోంది. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో మొదట ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందజేసింది. తర్వాత ఒక్కొక్కరికీ పది కిలోల చొప్పున అందజేసింది. ప్రస్తుతం దానిని ఐదు కిలోలకు తగ్గించి ఉచితంగానే పంపిణీ చేస్తుంది. అలాగే అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేయనున్నారు.
డిసెంబర్ కోటా 2905257 కిలోలు
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 423 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,20,745 రేషన్ కార్డులుండగా, ఇందులో ఆహార భద్రత కార్డులు(ఎఫ్ఎస్సీ) 2,05,072కిగాను 24,15,433 కిలోల బియ్యం, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు (ఏఎఫ్ఎస్సి) 15,504కు గాను 4,88,924 కిలోలు, అన్నపూర్ణ (ఏఏపీ) కార్డు లబ్ధిదారులు 169 మందికిగాను 900 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ నెలకు 29,05,257 కిలోల (2905.257 మెట్రిక్ టన్నులు) బియ్యం తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయనున్నారు.
పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ నెలకు సంబంధించి ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 35 శాతం రేషన్ బియ్యం చౌకధరల దుకాణాలకు పంపించాం. ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం అందించనున్నాం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభిస్తాం. లబ్ధిదారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తీసుకువెళ్లాలి.