పెండ్లి చేయాలా? వాయిదా వేయాలా? అనే సందిగ్ధంలో వధూవరుల తల్లిదండ్రులు
దండేపల్లి, ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ సింగరేణి ఉద్యోగి తన కూతురు వివాహం చేయడానికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం నిర్వహించారు. మేలో వివాహం చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఎండలు ఉంటాయనే ఉద్దేశంతో ఏసీ ఫంక్షన్ హాలు కూడా బుక్ చేశాడు. అడ్వాన్స్గా లక్ష రూపాయలు ఇచ్చాడు. బంగారం, బట్టలు, ఇతర ఫర్నిచర్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో అయోమయానికి గురవుతున్నాడు. పెళ్లి ఎలా చేయాలనే సందిగ్ధంలో ఉన్నాడు.
పెండ్లి.. మనిషి జీవితంలో ఓ అపూరూపమైన ఘట్టం! కలకాలం గుర్తుండి పోయే ఓ మధురమైన జ్ఞాపకం! రెండు మనసులు ఏకం చేసే అపురూప వేడుక! అందుకే ఈ వేడుకను ఎవరైనా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు! వందలు, వేలాది మంది బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటవుతారు! కానీ, ఆ పెండ్లి వేడుకపై కరోనా బుసలు కొడుతున్నది. దాదాపు 80 రోజుల తర్వాత వచ్చే నెల నుంచి శుభముహూర్తాలు మొదలవుతున్నా వైరస్ వ్యాప్తి కలవరపెడుతున్నది. కొవిడ్ కారణంగా వివాహాలను ఏడాదిగా వాయిదా వేసి, ఈ సారైనా ఘనంగా పెళ్లి చేసుకుందామని కన్న కలలను కల్లలు చేస్తున్నది. వచ్చే నెల ఒకటి నుంచి జూలై మొదటి వారం వరకు ఉన్నా లగ్గా లకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. మహమ్మారి విజృంభణ, కొవిడ్ నిబంధనల మధ్య వధూవరుల తల్లిదండ్రుల్లో సందిగ్ధం కనిపిస్తున్నది.
గతేడాది మార్చి, ఏప్రిల్, మేలో మంచి ముహూర్తాలు ఉండడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కల్యాణ మండపాలకే కాదు, వంటలు, వాహనాలు, హోటళ్లు.. ఇలా పెళ్లికి కావాల్సిన ప్రతి దానికీ అడాన్స్లు ఇచ్చారు. ఇక పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగాల్సి ఉండగా, గతేడాది మార్చి 3వ వారం నుంచి కరోనా ఉగ్రరూపం దాల్చడంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. వివాహ వేడుకలకు 25 మందికి మించి హాజరు కావద్దని ఆదేశాలు ఇచ్చాయి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి శుభకార్యాలకు ఎక్కువ మంది హాజరైన చోట పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో కొందరు పెళ్లిళ్లను నామమాత్రంగా ముగించగా.. జీవితంలో గుర్తుండిపోయే ఘట్టం కావడంతో మరికొందరు వాయిదా వేసుకున్నారు. వైరస్ తగ్గిన తర్వాత చేసుకుందామని భావించి అప్పుడే ముహూర్తాలు ఖరారు చేశారు. అవి ఈసారి మే, జూన్ నెలల్లో కుదరడంతో ఎదురుచూస్తున్నారు.
ముంచుకొస్తున్న ముహూర్తం..
గతేడాది మార్చిలో మొదలైన కరోనా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. జనవరి మూడో వారం నుంచి శుక్రమూఢం కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి వాటికి ముహూర్తాలు లేకుండా పోయాయి. మళ్లీ వైశాఖ మాసంలో మంచి రోజులు మొదలవుతున్నాయి. శాస్త్రం ప్రకారం మే ఒకటో తేదీ నుంచి జూన్ మొదటివారం వరకు ముహూర్తాలున్నా.. మేలోనే దివ్యమైన ముహూర్తాలున్నాయని చెబుతున్నారు పండితులు. గతేడాది ఏర్పడిన ఆటంకాలు, మధ్యలో వచ్చిన మూఢం.. ఇలా విభిన్న కారణాల వల్ల సుమారు ఏడాదిపాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో కొంత కరోనా తగ్గినట్లు కనిపించగా.. ప్రస్తుత ముహూర్తాలను పరిగణలోకి తీసుకొని మళ్లీ శుభకార్యాలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లిళ్లను వైభవంగా నిర్వహించేందుకు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. మేలో కుదిరిన పెళ్లిళ్లకు ఒక దశలో కల్యాణ మండపాలే దొరడకం గగనమైంది. తప్పని పరిస్థితుల్లో చాలా మంది ముహూర్తాలను జూన్కు మార్చుకోవాల్సి వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మే ఒకటి నుంచి జూన్ మొదటి వారం వరకు సుమారు వేలాది పెళ్లిళ్లు ఉన్నట్లుగా తెలుస్తున్నది.
కరోనా కలవరం..
ఓవైపు కల్యాణ ఘడియలు ముంచుకొస్తుండగా, మరోవైపు కరోనా కలవర పెడుతున్నది. ఈ రెండింటి మధ్య ఏమిచేయాలో అర్థం కాక వధూవరుల ఇండ్లల్లో అయోమయం నెలకొన్నది. వివాహ వేడుకలను వాయిదా వేద్దామంటే ఇప్పటికే అడ్వాన్స్లు ఇచ్చారు. ఫంక్షన్హాళ్ల నుంచి మొదలు సన్నాయిల వరకు.. ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అడ్వాన్స్లు పోయినా సరే పెళ్లి వాయిదా వేద్దామనుకుంటే.. కరోనా కనుమరుగయ్యే దెప్పుడో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బంధు, మిత్ర వర్గాలను పిలువకుండానే పెళ్లి చేయాలా? లేక వేచి చూడాలా? జీవితంలో గుర్తుండి పోయే అపురూప వేడుక ఘట్టాన్ని నలుగురి మధ్యే పూలదండలతో పూర్తిచేయాలా? లేక మరికొన్ని రోజులు వాయిదా వేసుకోవాలా? గుట్టుచప్పుడు కాకుండా బంధువులను ఆహ్వానించినా.. ఎవరైనా వస్తారా? రారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రులను సతమతం చేస్తున్నాయి.
అడ్వాన్స్లూ అంతే..
కల్యాణ మండపాలు, ఫంక్షన్హాళ్లు, హోటళ్లతోపాటు షామియానాలు, పూల డెకరేషన్లు, వంట పనివారలు, అనేక రకాల ఈవెంట్లకు అధిక మొత్తాల్లో ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించారు. ఇప్పుడివి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది మార్చిలో చాలా మంది వధూవరుల తల్లిదండ్రులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ‘మీ ఇష్టమైతే పెళ్లి చేయండి. మాపని మేం చేసి వెళ్తాం’ అంటూ అడ్వాన్స్ తీసుకున్న వారు తెగేసి చెప్పారు. అంతేకాదు ‘మీ పెళ్లి ఉందని మరెక్కడా అడ్వాన్స్లు తీసుకోలేదు. మేం తీసుకున్న అడ్వాన్స్లను మాకు కావాల్సిన వస్తువులకు ఇచ్చాం’ అని చెప్పి, చాలా మంది అడ్వాన్స్లు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు అదే జరుగుతున్నది. కల్యాణ మండపాల నిర్వాహకులు నిర్మోహమాటంగా అడ్వాన్స్లు ఇచ్చే ప్రశ్నేలేదని చెపుతున్నారు. ముహూర్తాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటే.. కరోనా నిబంధనలకు లోబడి తాము సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. నిబంధనలకు మించి ఎక్కువ మంది వస్తే.. అధికారులు తీసుకునే చర్యలకు ఆ కుటుంబాలే బాధ్యత వహించాలని లేటర్ రాయించుకుంటున్నారు.
నిబంధననలు తప్పనిసరి..
గతేడాది కరోనా పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడూ అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఫంక్షన్ల వేదికగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. కొవిడ్ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఈ సమయంలో శుభకార్యాలు, ఆర్భాటాలకు వెళ్లకపోడమే మంచింది. ఒకవేళ జరుపుకున్న నిబంధనలను ఉల్లంఘించవద్దు. పెళ్లిళ్ల విషయంలోనూ ఇదే పాటించాలి. తప్పని పరిస్థితుల్లో వివాహాలు జరిపించాల్సి వస్తే పరిమిత సంఖ్యలోనే జనం ఉండాలి. ఇదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్ ఉధృతమైన తరుణంలో దేవుళ్ల కల్యాణాలు, శ్రీరామనవమి వేడుకలు వంటివే ఆంక్షల మధ్య జరిగాయి. ఇప్పుడు శుభకార్యాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నది. అందుకే పెళ్లిళ్లనే నమ్ముకొన్న వివిధ వర్గాల్లో ఆందోళన కనిపిస్తున్నది.
తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు..
పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా కొద్దీ తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. ముహూర్తం తేదీలను మార్చుకునే అవకాశముందా..? అని ఎక్కువ మంది అడుగుతున్నారు. కొంత మంది ముందుగా నిర్ణయించిన ముహూర్తాలు మార్చుకొని.. మళ్లీ పాత ముహూర్తాలే ఖరారు చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి పనుల కోసం ఇచ్చిన అడ్వాన్స్లు ఎవరూ తిరిగి ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతే కాదు, మళ్లీ ఆగస్టు వరకు పెళ్లిళ్లు లేవు. ఏడాది సంది వివిధ కారణాలతో పెళ్లిళ్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ సారి వచ్చే రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. లక్షకుపైగా పెళ్లిళ్లు ఉండనున్నాయి. అందుకే అందరూ కల్యాణ మండపాలతో సహా అన్ని బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం మేం ఇచ్చే సలహా ఒక్కటే.. ముహూర్త బలం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అయితే ఇదే సమయంలో ఆందరి ఆరోగ్యం ముఖ్యమే. కొవిడ్ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో చుట్టాలను ఆహ్వానించాలని వధూవరుల తల్లిదండ్రులకు వివరించి చెబుతున్నాం.