ఎదులాపురం, మే 26 : రాష్ట్ర ప్రభుత్వ విధించిన లాక్డౌన్ సత్ఫలితాలిస్తుందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ప్రణాళిక ప్రకారం సంబంధించిన ప్రభుత్వ శాఖల సహకారంతో 15వ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నది. బుధవారం లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ టెస్ట్ చేసినవారిలో కేవలం 1.6 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో అనుమతుల కోసం ఇప్పటివరకు 4259 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 1983 మందికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 2276 మంది దరఖాస్తుదారులకు సరైన పత్రాలు చూపించకపోవడంతో అనుమతి ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయదారులు సంబంధిత వ్యాపారులకు సంబంధిత డీఏవో మార్క్ఫెడ్ అధికారులు జారీ చేసిన పాస్ పత్రాలతో రావాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాస్రావు, బీ వినోద్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వీపూరి సురేశ్ ,సీఐలు,ఎస్లు ఉన్నారు.
పకడ్బందీగా అమలు
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులను ఏసీపీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న బట్టల దుకాణం యజమానికి జరిమానా విధించారు. కాగజ్నగర్లో పట్టణంలోని లారీచౌరస్తా, రాజీవ్గాంధీ చౌరస్తాలో, మార్కెట్ ప్రాంతాల్లో లాక్డౌన్ను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పర్యవేక్షించారు. కౌటాల మండల కేంద్రంలో లాక్డౌన్ను ఆయన పరిశీలించారు. కౌటాల, చింతలమానేపల్లిలో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని, చెక్పోస్ట్ను పరిశీలించారు.