దండేపల్లి, జూన్ 24 : వానకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్యులు, సిబ్బందిని డీఎంహెచ్వో సుబ్బారాయుడు ఆదేశించారు. దండేపల్లి మండలంలోని తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని ఫార్మాసిస్టు, ల్యాబ్ గదులను తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్, టెస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న పథకాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గిరిజన గూడేల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్ఫూరణ, హరీశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
జన్నారం పీహెచ్సీలో..
జన్నారం, జూన్ 24 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను డీఎంహెచ్వో సుబ్బారాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై కళాజాత
దండేపల్లి, జూన్ 24 : మండలంలోని నాగసముద్రం గ్రామంలో గురువారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో కరోనా నివారణ, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాత నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. లక్షణాలుంటే టెస్టులు చేయించుకోవాలన్నారు. హోం ఐసొలేషన్లో ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న మందులు వాడాలన్నారు. కరోనా కట్టడికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనవేని ప్రేమళ, సాంస్కృతిక సారథి కళాబృందం టీం లీడర్ శ్రావణ్కుమార్, లచ్చన్న, మురళి, పోషం, శ్రీనివాస్, రమేశ్, నాగలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.