రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్, జూలై 23 : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు అధికారులు జాగ్రత్తగా ఉండాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షానికి దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో లో లెవెల్ కాజ్వేలపై ఇంకా నీరు ప్రవహిస్తున్నదని, అక్కడ 24 గంటలు ప్రత్యేక టీమ్లను ఉంచి ఎవరూ వాటిని దాటకుండా చూడాలన్నారు. గురువారం జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టంగా మారిందని, వీటి ద్వారా గుణపాఠం నేర్చుకుని అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు రావడానికి సమయం పడుతుందని, సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూటీం గోలేటి లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పెద్ద వాగులో చిక్కుకున్న వారిని రక్షించిన సింగరేణి రెస్క్యూటీం వారికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారశుధ్య పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యే గర్భిణులను గుర్తించి ప్రమాదం లేని ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీని కోసం కాగజ్నగర్, ఆసిఫాబాద్లలో క్వారంటైన్ మాదిరిగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారికి రానున్న మూడు రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయకూడదన్నారు. ఎక్కడైతే బ్రిడ్జిలపై నుంచి నీటి ప్రవాహం ఉందో అక్కడ వెంటనే టీంలను ఏర్పాటు చేసి ఫొటోలు దించి తనకు పంపించాలని తెలిపారు. వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని సూచించారు. ఒకవేళ అవసరమైతే పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి హాస్టళ్లను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో నాలాలపై అక్రమ కట్టడాలు తొలగిస్తామని తెలిపారు. తహసీల్ కార్యాలయంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలన్నారు. కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, చింతలమానేపల్లి మండలాలకు విద్యుత్ సరఫరా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డి, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఆర్వో కదం సురేశ్, అన్నిశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.