కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం
కెరమెరి, జూన్ 23 : గ్రామాల్లో ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం సూచించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వీధులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలంలో ఇండ్లు, దుకాణాల ఎదుట మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కార్యదర్శికి సూచించారు. చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రహదారులపై పశువులు సంచరించకుండా యజమానులకు నోటీసులు జారీ చేయాలని, స్పందించకపోతే పశువులను గోశాలకు తరలించాలన్నారు. కెరమెరి పల్లె ప్రకృతి వనాన్ని చూసి, జీపీ సిబ్బందిని అభినందించారు. ఎస్సీ కాలనీలో మురుగు కాలువలు, పరిసరాల శుభ్రత పాటించేలా చూడాలని కార్యదర్శిని, ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీవో నగేశ్ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించి, రోగుల పరిస్థితిపై వైద్యాధికారి సుంకన్నను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ టీకా వేయాలని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో దత్తారాం, ఏపీవో నగేశ్, ఎంపీవో మహేందర్, ఆర్ఐ అనసూయ, ఫార్మాసిస్ట్ ఖలీల్హుస్సేన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాథోడ్ ఉత్తం నాయక్ తదితరులు పాల్గొన్నారు.