అధికారుల సెలవులు రద్దు
అందుబాటులో ఉండి తక్షణ చర్యలు తీసుకోవాలి
సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నంబర్ 8790256720 ఏర్పాటు
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్ టౌన్, జూలై 22 : జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం అసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో వర్షం, వరదలపై వివిధ శాఖల అధికారుతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారుల సెలవులు రద్దు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల గ్రామాల నిండు గర్భిణులను గుర్తించి వారిని హెడ్ క్వార్టర్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్, కంఠ కాలనీ, రాజంపేట్ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయని, వెంటనే నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. జలపాతాల వద్దకు పర్యాటకులు వెళ్లకుండా చూడాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు, విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరద ముంపు ప్రాంతాల తక్షణ చర్యల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 18005991200 ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేగాకుండా సహాయం కోసం ఎస్ఐలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఎస్పీ సుధీంద్ర, అటవీ శాఖ అధికారి శాంతారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.