మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ
నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం
చొప్పదండి, జూలై 7: పట్టణంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ సూచించారు. పట్టణంలోని 9వ వార్డులో బుధవారం చేపట్టిన పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి, మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనాల్లో వేయాలని సూచించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే అధికారులు జరిమానా విధిస్తారని తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్ కొత్తూరి మహేశ్ తదితరులు ఉన్నారు.
చొప్పదండి, జూలై 7: హరితహారంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మొక్కలను ఇండ్ల ఆవరణలో నాటి సంరక్షించాలని జడ్పీ సీఈవో రమేశ్ పిలుపునిచ్చారు. మండలంలోని రుక్మాపూర్లో ఆయన ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ, హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ ముద్దసాని చిరంజీవి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు.
గంగాధర, జూలై 7: మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం బుధవారం ఏడో రోజూ ఉత్సాహంగా కొనసాగింది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజలు శ్రమదానం చేశారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించారు. మార్కెట్, ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించారు. అవసరమున్న చోట కొత్త స్తంభాలు వేశారు. తాడిజెర్రిలో డీఎల్పీవో హరికిషన్, నారాయణపూర్లో సీడీపీవో కస్తూరి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 7: ప్లాస్టిక్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ జవ్వాజి శేఖర్ పిలుపునిచ్చారు. వెంకట్రావుపల్లిలో సర్పంచ్ అధ్యక్షతన ప్లాస్టిక్ వాడకంతో వచ్చే అనర్థాలపై పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ తీశారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ను నిషేధించాలని కోరారు. కాగా, మండలంలోని అన్ని గ్రామాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలగించారు. మండల పరిషత్ కార్యాలయంలో విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులతో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరావు, మిషన్భగీరథ ఈఈ సతీశ్, మండల ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీవో సతీశ్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 7: మొగ్దుంపూర్ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా అవసరమున్న చోట విద్యుత్ స్తంభాలను అమర్చారు. సర్పంచ్ జక్కం నర్సయ్య, ఎంపీటీసీ పుష్పాఅంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సల్మాన్ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ సంపత్కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 7: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి మధుసూదన్ సూచించారు. మండలంలోని నగునూర్, చామనపల్లి, బహ్దూర్ఖాన్పేట, ఫకీర్పేట, ఇరుకుల్ల, దుర్శేడ్, మందులపల్లి, నల్లగుంటపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీలు తీశారు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ, మహిళలు ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 7: గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాలువల పక్కన వరుస క్రమంలో మొక్కలు నాటి, సంరక్షించాలని ఉపాధి హామీ ఏపీడీ మంజులాదేవి సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుబ్బపల్లి, చామనపల్లి, గుంటూర్పల్లి, జూబ్లీనగర్ గ్రామాల్లో హరితహారం మొక్కలు, పల్లె ప్రకృతి వనాలను బుధవారం ఆమె పరిశీలించారు. చామనపల్లిలో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం బాగుందని పాలకవర్గ సభ్యులు, అధికారులను అభినందించారు. మండలంలో ఈనెల 25వ తేదీలోగా 10,666 మొక్కలు నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మి, సర్పంచులు రుద్ర భారతి, బోగొండ లక్ష్మి, సిరిగిరి దుర్గ, పురుమల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.