ఇందూరు, జూలై 4 : జిల్లా దవాఖానలో 57 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని , రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రూ.ఐదు కోట్లకు పైగా వెచ్చించి అధునాతన వైద్య పరికరాలు, యంత్రాలను తెప్పించినట్లు తెలిపారు. ఆదివారం ఆయన వైద్యారోగ్య శాఖ అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ల్యాబ్ల్లో పలురకాల వైద్య పరీక్షలకు ప్రజలు వేల రూపాయలు చెల్లిస్తున్నారని అన్నారు. వాటి నుంచి విముక్తి కల్పించడానికి రూ. ఐదు కోట్లతో పరికరాలు తెప్పించినట్లు చెప్పారు. ఈ యంత్రాలతో జ్వరాలతోపాటు 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో ఈ సేవలు అందిస్తున్నామన్నారు. సేవలు పొందే ప్రజలు మొదట వారి పరిధిలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
అక్కడి డాక్టర్ల సూచన మేరకు జిల్లా దవాఖానకు రావాలన్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన ఫలితాల నివేదికలను జిల్లా దవాఖాన నుంచి సంబంధిత సెంటర్లతోపాటు రోగుల సెల్ఫోన్కు కూడా పంపిస్తారని వివరించారు. నివేదికల ఆధారంగా సదరు రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వ దవాఖాన, పీహెచ్సీ, సీహెచ్సీ, యూపీహెచ్సీలో పరీక్షలు నిర్వహించడానికి వైద్యాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బాలనరేంద్ర, డిప్యూటీ డీఎంహెచ్వోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.