బీజింగ్, జూలై 1: ఎవరైనా చైనాను వేధించాలనుకుంటే తలపగులడం ఖాయమని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. చైనా ఎప్పుడూ ఏ ఇతర దేశాన్ని వేధించలేదని, అణచివేయలేదని, అలాగే చైనాపై ఏ ఇతర దేశాన్నీ అలాంటి చర్యలకు అనుమతించబోమని అన్నారు. ‘ఒకవేళ ఎవరైనా ఆ దుస్సాహసానికి ప్రయత్నిస్తే 140 కోట్ల మంది చైనా ప్రజలు నిర్మించిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఢీకొని తలపగులడం తథ్యమ’ని వ్యాఖ్యానించారు.
అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చరిత్రాత్మక తియాన్మెన్ స్క్వేర్లో 70 వేల మందితో భారీ సభ నిర్వహించారు. ‘చైర్మన్’ మావో జెడాంగ్ భారీ చిత్తరువుతో అలంకరించిన తియాన్మెన్ గేట్ బాల్కనీ నుంచి, మావోను తలపించే ఆహార్యంతో జిన్పింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్లైపాస్ట్లో 71 విమానాలు పాల్గొన్నాయి. తమ అభివృద్ధికి అమెరికా అడ్డు తగులుతున్నదంటూ చైనా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాను లొంగదీసుకోవడం, బెదిరించడం, అణచివేయడం లాంటి ప్రయత్నాలను సహించేది లేదంటూ జిన్పింగ్ స్వరం పెంచారు. తైవాన్ విలీనానికి కట్టుబడి ఉన్నామంటూ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకుంటామన్నారు.
సీపీసీకి వామపక్షాల అభినందన
సీపీసీకి సీపీఐ, సీపీఎం శుభాకాంక్షలు తెలిపాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో, తమ దేశ ఆర్థిక రంగాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలుపడంలో చైనా అనుసరించిన మార్గం ప్రపంచానికి ఒక పాఠమని సీపీఐ, సీపీఎం కొనియాడాయి. చైనా అధ్యక్షుడు, సీపీసీ అధినేత షీ జిన్పింగ్కు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా వేర్వేరుగా లేఖలు రాశారు.