జహీరాబాద్, జూన్ 27 : రైతులు వర్షధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేసుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు వేసేందుకు అన్నదాతలు వ్యవసాయ భూముల్లో జోరుగా పనులు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటల సాగుతోపాటు వాణిజ్య పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జహీరాబాద్ డివిజన్లో రైతులు చెరుకు, అల్లం, పసుపు, బొప్పాయి పంటలు సాగు చేసే వారు. మార్కెట్లో డిమాండ్తోపాటు కూలీల సమస్య అధికంగా ఉండడంతో రైతుల ఆలోచన మారిపోయింది. ఏడాదిలో రెండు పంటలు తీయడంతోపాటు మార్కెట్లో మంచి ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గతంలో పత్తి సాగు చేయాలంటే ఆంధ్ర ప్రాంత వారు భూములు లీజ్కు తీసుకొని సాగు చేస్తే వారు. విత్తనాలు, రసాయన మందులు వేసి ఇక్కడ రైతులు పంటలు సాగు చేసే వారు. గత ఆరేండ్లుగా పరిస్థితి మరిపోయింది. ఇక్కడ రైతులు అధికంగా పత్తి పంటను సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మిల్లులు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తున్నది. పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. దీంతో ఏడాది నుచి రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
తెల్ల బంగారం సాగు వైపు రైతన్నల చూపు..
గతేడాది జహీరాబాద్ డివిజన్లో వానకాలంలో 1,76,290 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సీజన్లో రైతులు 1,77,500 ఎకరాల్లో వర్షధార పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే అధికంగా పంటలు సాగు చేస్తారని, దీంతో మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు అధికంగా జరిగాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది పత్తి 57,838 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సీజన్లో రైతులు 69 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోయాబీన్ 34,083 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. గతేడాది కందుల సాగు 24,254 ఎకరాల్లో ఉండగా.. ఈ ఏడాది 35 వేల ఎకరాల్లో సాగు చేయడంతో కంది సాగు పెరుతుంది. జొన్న పంట గతేడాది 1550 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మినుము సాగు పెరిగినా.. పెసరా పంట సాగు రైతులు తగ్గించే అవకాశం ఉందని వారు తెలిపారు.
వర్షధార పంటలపై ఆసక్తి..
జహీరాబాద్ డివిజన్లో నీటి వనరులు లేవు. రైతులు వరి సాగు చేయారు. చెరుకు, అల్లం, బొప్పాయి, పసుపు, కూరగాయలు వ్యవసాయ బోరు బావుల వద్ద సాగు చేస్తారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో వ్యవసాయ బావుల వద్ద వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో అధిక శాతం మంది రైతులు వానకాలంలో సో యా, పత్తి, తెల్లజొన్న, పచ్చజొన్న, కంది, మినుము, పెసరాతోపాటు చిరుధాన్యాల పంటలైన సజ్జలు, రాగులు, కొర్రలతోపాటు పలు పంటలు సాగు చేస్తారు. మార్కెట్లో అధికంగా పత్తి పంటకు డిమాండ్ ఉంది. డిమాండ్తోపాటు వర్షధారంగా పంట సాగు చేసే అవకాశం ఉంది. పంట దిగుబడి సైతం అధికంగా ఉండడతో రైతులు పత్తి సాగు వైపు వెళ్తున్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతోపాటు ఇంట్లో ఆహారంగా తీసుకునేందుకు సన్న, చిన్నకారు రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.
తెలంగాణ పత్తికి మంచి డిమాండ్..
పత్తి పంటను రైతులు తెల్ల బంగారంగా పిలుస్తారు. పత్తికి మిగతా పంటలతో పోల్చితే సాగు ఖర్చు సైతం ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులు ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తారు. పత్తి పంట దిగుబడి నల్లరేగడి భూముల్లో నీళ్లు పెడితే ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. వర్షధారంగా సాగు చేసే రైతులు ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. చెలక భూముల్లో నీళ్ల వసతి ఉంటే ఎకరాకు 6 నుంచి 7, వర్షధారంగా 5 నుంచి 6 క్వింటాళ్లు వస్తున్నది. మార్కెట్లో ప్రస్తుతం మద్దతు ధర క్వింటాల్కు రూ.4,500 నుంచి 5,500 వరకు ఉంది. జహీరాబాద్ డివిజన్లో నల్లరేగడి భూములు ఉండడంతో పత్తి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్లు దాటలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు చూపిన లెక్కల ప్రకారం ఎకరాకు రైతుకు రూ.40 వేల ఆదాయం వస్తున్నది. పత్తి పంట సాగు చేసేందుకు రైతులు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తారు. ఖర్చులు పోను రూ.15 వేల వరకు రైతుకు మిగులుతున్నట్టు వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపుతున్నది. విదేశాల్లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ధర పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో సైతం పత్తికి అధి క ధర ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది..
పత్తికి మార్కెట్లో మంచి ధర ఉండడంతో పాటు దిగుబడి అధికంగా రావడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ సీజన్లో పత్తి సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చేసిన సర్వేలో తేలింది. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వ్యాపారి నుంచి తప్పుకుండా రసీదు చేసుకోవాలి. పంట నష్టం జరిగితే విత్తన కంపెనీ నుంచి నష్ట పరిహారం పొందే అవకాశం ఉంది. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు పత్తిని వర్షధారంగా, వ్యవసాయ బావుల వద్ద నీటి సరఫరా చేసి సాగు చేస్తారు. గతేడాది ప్రభుత్వం పత్తి మిల్లుల వద్ద కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడంతో రైతులకు నష్టం లేకుండా అమ్మకాలు చేశారు. ఈ ఏడాది న్యాల్కల్, ఝరాసంగం మండలంలో పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది.