సిటీ బ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ఆకలి విలువ ఏమిటో ఆయనకు తెలుసు.. ఆర్థికంగా ఎదిగినా.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను మరచిపోలేదాయన. కేఫ్ ద్వారా తనకు వస్తున్న ఆదాయం నుంచి కొంత డబ్బును వెచ్చిస్తూ.. పేదల కడుపునింపుతున్నాడు. ఒకప్పుడు సాధారణ చాయ్వాలాగా పనిచేసి.. వ్యాపారవేత్తగా ఎదిగిన నిలోఫర్ కేఫ్ అండ్ బేకర్స్ యజమాని అనుముల బాబూరావు దాతృత్వం ఎందరికో స్ఫూర్తినిస్తున్నది. ఎంఎన్జే వద్ద ప్రతి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందిస్తూ… గొప్ప మనసును చాటుకుంటున్నారు. ‘అన్నదాత.. సుఖీభవ’ అంటూ.. పేదల నుంచి ఆశీస్సులు అందుకుంటున్నారు.
మాది పేద కుటుంబం. ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలం, లగాం గ్రామం మా ఊరు. పదో తరగతి పుస్తకాల కోసం మా నాన్న పాడి ఆవును అమ్మి రూ.100 నాకు ఇచ్చారు. ఆ తర్వాత చదవాలని కోరిక ఉన్నా.. కుటుంబ పరిస్థితుల వల్ల పై చదువులకు వెళ్లలేదు. బతుకు దెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చాను. నిలొఫర్ కేఫ్ ఏర్పాటు చేశాక.. ఆర్థికంగా ఎదిగినా కూడా.. ఆకలి విలువ తెలుసు కాబట్టి.. నా వంతు బాధ్యతగా వందల మంది కడుపునింపేందుకు ప్రయత్నిస్తున్నా. ఎంఎన్జే వద్ద రోగుల బంధువులు వంట చేసుకునేందుకు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశా. కొందరు పేదలు వంటకు అవసరమైన సరుకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి గమనించాను. ఎంతమందికైనా సరే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నా. రోజూ 400 మంది వరకు రోగులు, వారి బంధువులకు ఉదయం అల్పాహారం, 300 మందికి మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నా. అవకాశాన్ని బట్టి ఉదయం పూట టిఫిన్ను నా చేతుల మీదుగా వడ్డించే ప్రయత్నం చేస్తున్నా. అలా చేయడం వల్ల నాకు ఎంతో సంతృప్తి కలుగుతున్నది. నాకు దేవుడు ఇస్తున్నాడు. అందులో నుంచి కొంత డబ్బుతో పేదలకు అన్నం పెడుతున్నా. – బాబూరావు, నిలోఫర్ కేఫ్ యజమాని