పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇవాళ గోవా రెవల్యూషన్ డే. ఈ సందర్భంగా మార్గోవాలో ఉన్న అమరవీరుల స్మారకం వద్ద ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ప్రమోద్.. పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం ప్రమోద్.. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సీఎం ప్రమోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సారథ్యంలోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆయన అన్నారు. కోవిడ్19 ఆంక్షలు ఉన్నా.. చాలా వరకు రాజకీయ పార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.