ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒట్టి పుకారని అన్నారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఉద్ధవ్ ఠాక్రే ఐదేండ్ల పాటు సీఎంగా ఉండటంపై అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని నిర్ణయించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పు గురించి ఎవరైనా మాట్లాడితే అది అబద్ధం, పుకారు తప్ప మరొకటి కాదన్నారు.
తమ మూడు పార్టీలు (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) విలీనం కాలేదని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మూడు పార్టీల కూటమి అన్నారు. తమ తమ పార్టీలను విస్తరించుకునే, బలోపేతం చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న నిబద్ధత తమకు లేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల అంశంలో స్థానిక నేతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేవలం లోక్సభ, రాష్ట్ర ఎన్నికలకు మాత్రమే వ్యూహరచన చేస్తామని వివరించారు.