పుష్కలంగా ఔషధ గుణాలు
షుగర్ వ్యాధిగ్రస్తులకు సంజీవని
భువనగిరి అర్బన్, జూన్ 10 : నేరేడు.. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఫలం. సహజసిద్ధంగా దొరికే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. తీపి, వగరు, పులుపు రుచులతో నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. వేసవి చివరల్లో, వానకాలంలోనూ విరివిగా దొరుకుతుంది. చూడగానే నోరూరించే ఈ నేరేడు పండు పలు రుగ్మతలను నివారిస్తుంది. కేవలం పండులో మాత్రమే కాదు.. ఆకు, బెరడులోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తింటే దీర్ఘకాలిక రుగ్మతలు దరిచేరవు. అంతేగాక మధుమేహం తగ్గుముఖం పడుతుంది. అతిమూత్ర వ్యాధి నివారణతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం దీని సొంతం. అందుకే ఈ నేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా నిత్య యవ్వనులుగా ఉంటారని పెద్దలు చెబుతారు.
విటమిన్ సీ, ఫాస్పరస్, ఐరన్, క్రోమియం, పొటాషియం తదితర విటమిన్లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. పండుతో పాటు ఎండిన గింజలు నీళ్లల్లో పొడిచేసి తీసుకున్నట్లు అయితే గుండె జబ్బులు, మధుమేహం, బీపీ తదితర వ్యాధులను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. సీజనల్గా లభించే పండ్లలో ఎక్కువ ఔషధ గుణాలున్న పండు నేరేడు ఒక్కటేనని చెబుతారు. భూగర్భజలాలు గణనీయంగా పెరిగిన క్రమంలో ఈ ఏడాది నేరేడు చెట్లు విరివిగా పండ్లు కాసి పశుపక్ష్యాదులకు, బాటసారులకు వాటి ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరేడుచెట్ల ప్రాముఖ్యతను గుర్తించి పల్లెల్లో, రహదారులకు ఇరువైపులా, రైతుల వ్యవసాయ క్షేత్రల్లో పెంచుతోంది.