కల్హేర్, జూన్ 2: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందనతో ఓ రైతు మురిసిపోయిండు. పట్టా పాస్బుక్కులోకి భూమిని ఎక్కించిన పత్రం అందుకుని ‘సార్.. సల్లగుండాలె’ అంటూ దీవిస్తూ కృతజ్ఞతలు తెలిపిండు. ట్వీట్కు స్పందించి రెండురోజుల్లోనే సమస్య పరిష్కరించడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిండు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన రైతు మల్దొడ్డి లక్ష్మయ్య తండ్రి కిష్టయ్య మృతిచెందాడు. ఆయన పేరున పలు సర్వేనంబర్లలో ఉన్న భూమి పాసుబుక్లో నమోదు కాలేదు. సర్కారు అందించే రైతుబంధును అందుకోలేకపోయారు. మూడు నెలల కింద లక్ష్మయ్య తాసిల్దార్ సంప్రదించగా.. నమోదు ఆప్షన్ రాలేదని సమాధానమిచ్చారు. సమస్యను పరిష్కరించాలని రైతు లక్ష్మయ్య కుమారుడు సందీప్.. మంత్రి కేటీఆర్ను మే 31న ట్విట్టర్లో కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఈ విషయమై ట్వీట్ చేశారు. బుధవారం రైతుకు సంబంధించిన భూమిని పట్టా బుక్లో నమోదుచేసిన కల్హేర్ తాసిల్దార్.. లక్ష్మయ్యకు ధ్రువపత్రం అందజేశారు.