‘కెరీర్లో తొలిసారి సక్సెస్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని అన్నారు సంతోష్శోభన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏక్మినీ కథ’. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంస్థలు నిర్మించాయి. ఇటీవల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంతోష్శోభన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడు కార్తిక్ రాపోలు కథ చెప్పినప్పుడు రిస్క్ తీసుకుంటున్నాననే ఆలోచన రాలేదు. ఇప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ స్పృశించని సరికొత్త పాయింట్ను చర్చించే అవకాశం దొరికిందనే ఎైగ్జెట్మెంట్తోనే సినిమాను అంగీకరించా. తొలి రోజు నుంచి ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా అవుతుందనే విశ్వాసంతోనే పనిచేశాను. సినీ ప్రముఖుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా చూస్తూ రెండుగంటలు సమస్యల్ని మరచిపోయి నిజాయితీగా నవ్వుకున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. వారి మాటలు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దర్శకుడు కార్తిక్, రచయిత మేర్లపాక గాంధీ సహకారం వల్లే నటుడిగా నేను ఎంజాయ్ చేస్తూ సినిమాను పూర్తిచేశా. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు అవుతోంది. ఈ ప్రయాణంలో సినిమాల్లో వచ్చేవారందరికి ఎదురయ్యే కష్టాల్ని నేనూ పడా.్డ ఆ కష్టాలే నాకు ఆకలి విలువను తెలియజెప్పాయి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగుతూనే ఉండాలని నేర్పించాయి. థియేటర్లలో సినిమా విడుదల కాలేదనే బాధ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాలు బాగుండటమే ముఖ్యం. మంచి కథల్లో నటించాలని లక్ష్యంగా పెట్టుకున్నా . ‘ఏక్ మినీ కథ’ తర్వాత యూవీ క్రియేషన్స్లో మరో సినిమా చేయబోతున్నా. వినోదాత్మక కథాంశమది’ అన్నారు.