పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తాం
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
మెడికల్ కాలేజీ కోసం త్వరలో స్థలాన్ని పరిశీలిస్తాం
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, మే 18 : ఆంధ్రా పాలకుల నుంచి కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కలలుగన్న తెలంగాణ కళ్ల ముందే సాకారమవుతున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్కు మెడికల్ కాలేజీ కేటాయించిన సందర్భంగా మంగళవారం నెహ్రూ సెంటర్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి మంత్రి సత్యవతి.. సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ 2018 శాసనసభ, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మానుకోటలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పడు అనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఇదే గాక జిల్లాలో పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీలను కూడా తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులమందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించేదాకా విశ్రమించబోమన్నారు. త్వరలో మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మానుకోట, డోర్నకల్, ఇల్లందు ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, హరిప్రియలతో పాటు తాను చేసిన కృషి ఫలించిందన్నారు. కొవిడ్ కష్టకాలంలో రూ.2.7 కోట్లతో టీ డయాగ్నొస్టిక్ సెంటర్, ఇప్పుడు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ను మంజూరు చేయడం సీఎం గొప్పతనానికి నిదర్శనమన్నారు. అలాగే రీజినల్ సబ్సెంటర్ను ఏర్పాటు నిర్ణయం తీసుకొని కేసీఆర్ పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని సత్యవతి చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. తెలంగాణలో కేసీఆరే గొప్ప నాయకుడన్నారు. ఆయనకు దూరమైన వారు ఇప్పటివరకు బతికి బట్ట కట్టలేదన్నారు. మెడికల్ కాలేజీ కోసం మంత్రి దయాకర్రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం, మంత్రి సత్యవతి కృషి మరువలేనన్నారు. మానుకోట శాసనసభ్యుడిగా తన జన్మధన్యమైందన్నారు. ఇలా అభివృద్ధి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ను తన జన్మదినం సందర్భంగా ఇనుగుర్తిని మండలంగా ప్రకటించాలని కోరుతానన్నారు. తాను విద్యావంతుడను కాబట్టే మానుకోటలో ఉన్నత విద్య అందేందుకు కృషిచేస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ప్రతి కుటుంబంలో లబ్ధిదారులున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కేఎస్ఎన్.రెడ్డి, చిట్యాల జనార్దన్, లూనావత్ అశోక్, మీడియా ఇన్చార్జి మార్నేని రఘు పాల్గొన్నారు.
హామీని నెరవేర్చారు
2019 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ మానుకోటకు మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మెడికల్ కళాశాల ఇచ్చారు. సీఎం కేసీఆర్కు మానుకోట ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు. జిల్లా ప్రజల సమస్యలను చాలామార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రం మెడికల్ హబ్గా మారుతుంది. మెడికల్ కళాశాల వస్తే మానుకోట రూపురేఖలు మారిపోతాయి. మానుకోటకు వైద్యకళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని కొలుస్తారు.
మానుకోటకు గొప్పవరం
వైద్యకళాశాల రావడం మానుకోటకు గొప్పవరం. మనస్సున్న మహారాజు అని మరోసారి నిరూపించుకున్న సీఎం కేసీఆర్కు పాదాభివందనం. మానుకోట ప్రజల చిరకాలవాంఛను సీఎం నెరవేరుస్తున్నారు. మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల కోసం కేసీఆర్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం చరిత్రలో నిలిచిపోతుంది. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం నేను అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించాను. మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. – బానోత్ శంకర్నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే