మేడ్చల్, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో రోడ్డు పక్కన పొదల్లో సాధారణంగా కనిపించే మూలిక.. తిప్పతీగ. చాలామంది దీన్ని చూసే ఉంటారు. కానీ, దాని గొప్పదనమే తెలియదు. కరోనా కాలంలో ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైనది ఇదేనని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రోగనిరోధశక్తిని పెంచటంలో తిప్పతీగకు మరేది సాటిరాదని అంటున్నారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకు, కాండం, వేర్లలో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు ఆర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలిలా ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకొంటే రోగనిరోధకశక్తి పెరుగుతుందని వెల్లడించారు. జ్వరం కూడా రాదని, వచ్చినా వెంటనే తగ్గిపోతుందని వివరించారు. ఆయుర్వేదశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను ‘శంశమినిపటి’ పేరుతో మం దుల రూపంలో అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కీళ్ల సమస్యలు, ఎముకల వ్యాధులు, కాలే యం, మెదడు సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక సమస్యలను తిప్పతీగ తగ్గిస్తుందని వెల్లడించారు. తిప్పతీగకు మరణం ఉండదని, వేర్లు తెంచినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.