ఎన్నో కుటుంబాల్లో కరోనా తీరని విషాదం నింపుతుంది. చూస్తుండగానే తమ వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ దొరక్క కొందరు.. సరైన చికిత్స దొరక్క మరికొందరు.. వెంటిలేటర్ లేక ఇంకొందరు.. ఇలా మనకు కావాల్సిన వాళ్లే కళ్ల ముందు చనిపోతుంటే మౌనంగా రోదించడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ హీరోయిన్ సోదరుడు వెంటిలేటర్ దొరక్క చనిపోయాడు. అదే విషయాన్ని చాలా బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ హీరోయిన్. ఆమె ఎవరో కాదు.. రంగం సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న పియా బాజ్పెయీ. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాల్లోనూ నటించింది ఈమె. పియా సోదరుడు కొన్ని రోజుల కింద కరోనా బారిన పడ్డాడు.
ఆయన పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన సోదరుడికి అర్జెంట్ గా వెంటిలేటర్ సాయం కావాలని.. బెడ్ దొరకడం లేదని.. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఈమె వేడుకుంది. కానీ ఏం చేస్తాం.. అది కుదర్లేదు. ఉదయం 6.24 నిమిషాలకు సీరియస్ అని ట్వీట్ చేసిన ఈమె.. రెండు గంటల తర్వాత 8.40 నిమిషాలకు తన సోదరుడు చనిపోయాడంటూ ట్వీట్ చేసింది. అంతా చూస్తుండగానే కళ్ల ముందే అన్న ప్రాణాలు పోయాయని కన్నీరు పెట్టుకుంది పియా. సోదరుడి మరణం తట్టుకోలేపోతున్నానంటూ ఎమోషనల్ అయిపోయింది.
బాలీవుడ్లో చాలా మంది ఇలా తమకు కావాల్సిన వాళ్లను పోగొట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ సైతం కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆప్తులను కోల్పోయానని.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ట్వీట్ చేసారు. ఇప్పుడు పియా బాజ్పెయీ విషయంలోనూ ఇదే జరిగింది. రంగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలో నటించింది. మరో రెండు మూడు సినిమాలు కూడా చేసిన తర్వాత సరైన గుర్తింపు రాకపోవడంతో హిందీలో వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది.