టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించినందుకు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని సీఎం పునరుద్ఘాటించారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్తోపాటు నియోజకవర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిషరిస్తామన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరుచేసిన ఎత్తిపోతల పథకాలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకుల దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఎవరు ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా.. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టీఆర్ఎస్ మరింతగా పునరంకితమౌతుందని అన్నారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్కు సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చకగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. భగత్ విజయం కోసం కృషిచేసిన టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
సాగర్లో అభివృద్ధే గెలిచింది
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
సాగర్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమమే గెలిచిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పిన అబద్ధాలు ఓడిపోయాయని ఎద్దేవా చేశారు. సాగర్ ప్రజలు సీఎం కేసీఆర్పై మరోసారి తమ విశ్వాసాన్ని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఓడించిందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు స్థాయి, హోదాలు, రాజకీయ నేపథ్యాలను మరిచి ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు సహించరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.