టీవీల్లో రకరకాల అడ్వర్టయిజ్మెంట్లు చూస్తుంటాం. అలా చూసినప్పుడు చాలామందికి రకరకాల అనుమానాలు రావటంసహజం. విసుగుపుట్టేంత ఎక్కువసేపు వస్తున్నప్పుడు వీటికి అడ్డూ అదుపూ ఉండదా అని అనుమానం వస్తుంది . మరికొన్నిసార్లు మనల్ని నమ్మించటానికి అతిగా చెప్తున్నారనే అనుమానం రావచ్చు. పే చానల్స్వాళ్ళు నెలకింత అని చందా తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ అడ్వర్టయిజ్మెంట్లు రుద్దటం ఏమిటనే ప్రశ్న కూడా వస్తుంది. ఇదంతా ఒకవంతయితే, తప్పుదారిపట్టించే ప్రకటనలు మరికొన్ని. అలాంటి ప్రకటనలను నియంత్రించటానికి అవకాశం ఉందా, వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చా, ఎలాంటి చర్యలుంటాయి.. అనేవి సహజంగానే వచ్చే అనుమానాలు. వీటికి సమాధానాలు పరిశీలించాలి.
ఏదైనా వస్తువుగాని, సేవగాని ప్రజల్లోకి వెళ్ళి అమ్ముడుపోవాలంటే ముందుగా దాని గురించి తెలియాలి. తెలిసిన తర్వాత నమ్మకం కలిగితే కొనటం మొదలవుతుంది. ఎంత ఎక్కువమంది కొంటే అంత ఎక్కువ లాభం కాబట్టి ప్రజలకు తెలియజేయటానికి వీలున్న మార్గాలన్నిటినీ అమ్మకందారులు వెతుక్కుంటారు. అది టీవీ కావచ్చు, పత్రిక కావచ్చు, హోర్డింగులు కావచ్చు, ఆటోలు, బస్సులు, రైళ్ళు లాంటి ప్రయాణ సాధనాలు కావచ్చు. ఎక్కడ జనం కళ్ళు పడతాయో అక్కడ ప్రచారం కోసం ప్రయత్నించటం మామూలైపోయింది. రోజుకు సగటున మూడున్నరగంటల సేపు ఇంట్లో టీవీ ముందు కూర్చుంటారనే అంచనాతో టీవీలో ప్రకటనలివ్వటానికి పోటీపడేవాళ్లు బాగానే ఉంటారు.
టెలివిజన్ అనేది వినోదం, సమాచారం, విజ్ఞానం అందించే ఒక సాధనం. వాటిద్వారా ఆకర్షించి టీవీ చూడటాన్ని ఒక బలహీనతగా మార్చి, మెల్లగా మధ్యమధ్యలో ప్రకటనలు చూపించి ఆదాయం పొందటం టీవీల పని. కొన్నిసార్లు మరీ విసుగుపుట్టేంతగా యాడ్స్ వస్తుంటాయి. అసలు ప్రోగ్రామ్స్ మధ్య యాడ్స్ చూస్తున్నామా, యాడ్స్ మధ్య ప్రోగ్రామ్స్ చూస్తున్నామా అనిపిస్తుంది. అలాంటప్పుడు మరో చానల్కు వెళితే అక్కడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో 2012లో ట్రాయ్ చైర్మన్గా వచ్చిన రాహుల్ ఖుల్లర్ అప్పటికే యాడ్స్ మీద ఉన్న పరిమితిని అమలు చేయటానికి పూనుకున్నారు.
నిబంధనల ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాలపాటు వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాలపాటు సొంత కార్యక్రమాల గురించి ప్రేక్షకులకు తెలియజేసే ప్రకటనలు వేసుకోవచ్చు. దీన్నే స్థూలంగా 10+2 రూల్ అని పిలుస్తారు. దీన్ని చానల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. అయితే, ఇక్కడే చానల్స్ అతి తెలివి ప్రదర్శించాయి. గంటకు 12 నిమిషాల అవకాశం ఇచ్చారు కాబట్టి 24 గంటలకు 288 నిమిషాలపాటు యాడ్స్ వేసుకోవచ్చని అర్థం చెప్పుకొన్నాయి. అందుకే ప్రైమ్టైమ్లో యాడ్స్ సమయం ఎక్కువసేపు వాడుకొని అర్ధరాత్రి దాటాక జనం చూడని సమయంలో తక్కువ యాడ్స్ లెక్కచూపటం మొదలుపెట్టాయి. ఇది గమనించిన ట్రాయ్ మరింత స్పష్టంగా ఆదేశించి ఏ గంటకు ఆ గంట 10+2 నియమం వర్తిస్తుందని, రోజు మొత్తానికి కాదని చెప్పింది. దీని ప్రకారం అరగంట ఎపిసోడ్లో కనీసం 24 నిమిషాలపాటు ప్రోగ్రామ్ రావాల్సిందే. కానీ యాడ్స్ వేసుకోవటం మా హక్కు, మా వ్యాపారానికి అవసరం కాబట్టి ట్రాయ్ జోక్యం చేసుకోవటానికి వీల్లేదని కొన్ని చానల్స్ కోర్టుకు వెళ్లాయి. దీనిమీద స్టే వచ్చింది.
ఈలోపు ప్రతిరోజూ ఏ చానల్స్ ఈ నియమాన్ని ఉల్లంఘించి ఎంతసేపు ప్రకటనలు వేస్తున్నాయో నెలనెలా జాబితాలు విడుదల చేయటం ట్రాయ్ మొదలుపెట్టింది. సరిగ్గా ఆ సమయంలో ముందుగా జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ముందుకొచ్చి కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా 10+2 నిబంధనకు కట్టుబడి ఉంటామని చెప్పింది. అలా తక్కువ యాడ్స్ వస్తుంటే ప్రేక్షకులు అటువైపు వెళ్ళే అవకాశం ఎక్కువ కాబట్టి మిగిలిన చానల్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ గంటకు 10 నిమిషాల వాణిజ్యప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రకటనలకు పరిమితమయ్యాయి. న్యూస్ చానల్స్ మాత్రం ఈ నియమాన్ని పాటించటం లేదు. వీళ్ళ వాదన ఏమంటే, అత్యధికశాతం ఎంటర్టైన్మెంట్ చానల్స్ పే చానల్స్ కాబట్టి వాటికి ప్రేక్షకులు నెలవారీ చందా కడతారు. ఆ విధంగా వాటికి యాడ్స్ మీద ఆదాయంతోబాటు చందా ఆదాయం వస్తుంది. న్యూస్ చానల్స్లో 95 శాతం ఫ్రీ చానల్స్ కాబట్టి యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మీదనే బతకాలి. అందువల్ల ఈ రూల్ నుంచి మినహాయిం పు ఇవ్వాలంటూ కోర్టుకెళ్ళాయి. ప్రభుత్వం కూడా న్యూస్ చానల్స్ కోరికను పరిశీలిస్తున్నట్టు కోర్టుకు చెప్పింది. ఎనిమిదేండ్లు దాటినా ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.
న్యూస్ చానల్స్కు యాడ్స్ ద్వారా వచ్చేదే ఆదాయం కాబట్టి వాటి సంగతలా ఉంచితే, వినియోగదారుల దగ్గర చందా తీసుకునే ఎంటర్టైన్మెంట్ చానల్స్ మళ్ళీ యాడ్స్ తో విసిగించటం ఎంతవరకు సమంజసం? ఈ మధ్య చానల్స్ చందారేట్లు పెంచినప్పుడు కూడా యాడ్స్ వేసే పే చానల్స్ను బహిష్కరిస్తామంటూ పుట్టుకొచ్చిన టీవీ ప్రేక్షకుల సంఘాలు నానా హడావిడి చేశాయి. కానీ సామాన్య ప్రేక్షకులు ఏమీ పట్టించుకోలేదు. దీన్ని రెండు వైపుల నుంచీ చూడాలి. కేవలం యాడ్స్ మీద వచ్చే ఆదాయంతోగానీ, చందాల ద్వారా వచ్చే ఆదాయంతోగానీ చానల్స్ తమ ఖర్చులన్నీ రాబట్టుకోవటం సాధ్యం కాదన్నది నిజం. పదేండ్ల కిందట ఒక్కో కార్యక్రమం ఏపాటి నాణ్యతతో ఉండేది, ఇప్పుడెలా ఉంటున్నది అనేది గమనిస్తే ఖర్చులు పెరిగాయని అర్థమవుతుంది. అంతమాత్రాన అడ్డగోలుగా రేట్లు పెంచొ ద్దని ప్రేక్షకుల తరఫున ట్రాయ్ ప్రయత్నం చేస్తూనే ఉంది.
పత్రికలను ధరపెట్టి కొనుక్కుంటున్న పాఠకులు అందులో యాడ్స్ కూడా భరిస్తున్నారు కదా! టీవీ విషయంలోనే అభ్యంతరమెందుకు అనేది టీవీ యాజమాన్యాల మరో ప్రశ్న. దీనికి జనం వైపు నుంచి సమాధానం ఉంది. పత్రికలో యాడ్ కనిపిస్తే అది చదవటానికి అడ్డంరాదు. చదవాల్సిందే చదువుతాం. కానీ టీవీ అయితే ఆ యాడ్ పూర్తయ్యేదాకా వేచి ఉండక తప్పదు. టీవీ చానల్స్లో యాడ్స్ ఎంతసేపు రావచ్చునో పరిమితి పెట్టే అధికారం మాత్రమే ప్రభుత్వానికి, నియంత్రణ సంస్థ అయిన ట్రాయ్కి ఉంది తప్ప.. అసలు యాడ్స్ అనేవి ఉండకూడదని చెప్పే హక్కులేదు. పూర్తిగా యాడ్స్ లేని చానల్స్ రావాలనుకుంటే కనీసం రెట్టింపు నెలవారీ చందా కట్టేందుకు సిద్ధం కావాల్సిందే. బహుశా అలాంటి పరిస్థితి ముందు ముందు రావచ్చు. అప్పటిదాకా యాడ్స్ ఎంతసేపు వచ్చినా భరించాల్సిందే.
ప్రకటనల తీరుతెన్నులు ప్రజలను తప్పుదారిపట్టించేలా ఉండటం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉన్నది. మూఢనమ్మకాలను పెంచిపోషించేవి కొన్నయితే, వాస్తవదూరమైన అంశాలతో ప్రలోభానికి గురిచేసేవి మరికొన్ని. కొన్ని అతిశయోక్తులతో ప్రేక్షకులను మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తాయి. కేబుల్ టీవీ నెట్వర్క్స్ చట్టం ప్రకారం కార్యక్రమాలు, ప్రకటనలు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అలా కట్టుబడని పక్షంలో చర్య తీసుకోవటానికి అవకాశముంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ సంస్థ సిబ్బంది అన్ని చానల్స్లో ప్రసారమయ్యే కార్యక్రమాలను, ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. వాటిలో నియమాల ఉల్లంఘన జరిగినట్టు అనుమానం వస్తే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువస్తారు. దీన్నిఅంతర్-మంత్రిత్వశాఖల కమిటీ పరిశీలించిన తర్వాత తప్పని తేలితే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించటం, క్షమాపణలు చెప్పించటం తదితర శిక్షలు విధించే అవకాశముంటుంది.
అడ్వర్టయిజర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల మీద ప్రభుత్వ నియంత్రణ కంటే, అవే స్వీయనియంత్రణకు చొరవ తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంతో ప్రభుత్వం అంగీకరించింది. ఆ విధంగా 1985లో అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అనే సంస్థ ఏర్పాటైంది. ప్రకటనల్లో నిజాయితీ ఉండాలని, ప్రజలను తప్పుదారి పట్టించకూడదని, ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రచారం చేయకూడదని, పోటీదారుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలని ఈ సంస్థ నియమాలు చెప్తున్నాయి. వీటిని ఉల్లంఘించినట్టు భావిస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా 7710012345 నంబర్కు, మెయిల్ ద్వారా contact@ascionline.org కు ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా ప్రకటన ప్రాథమికంగా నియమాలను ఉల్లంఘిస్తున్నట్టు, ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే దాని ప్రసారం నిలిపివేయాలని ఆ ప్రకటన ప్రసారం చేయిస్తున్న సంస్థను, ప్రసార మాధ్యమాన్ని ఆదేశించవచ్చు. కన్స్యూమర్ కంప్లెయింట్స్ కౌన్సిల్ (సీసీసీ) 30 రోజుల్లోగా తుది నిర్ణయం ప్రకటిస్తుంది.
2020-21 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్ 2020)లో 1230 ప్రకటనలమీద 1885 ఫిర్యాదులు వచ్చినట్టు ఆస్కీ తెలియజేయగానే 251 ప్రకటనలను ఉపసంహరించుకోవటమో, సవరించుకోవటమో జరిగింది. 902 కేసులలో తప్పు తేలింది. ఇందులో 582 ప్రకటనలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, 128 ఆరోగ్యరంగానికి సంబంధించినవి. ఆహారం, శీతలపానీయాల ప్రకటనల మీద ఫిర్యాదులందాయి. 81 ప్రకటనలు మాత్ర మే నిబంధనలు ఉల్లంఘించలేదని తేలింది. తప్పుతేలిన కేసులలో వినియోగదారులనుంచి వచ్చిన ఫిర్యాదులు 51 మాత్రమే ఉండగా ఆస్కీ సుమోటోగా తీసుకున్నవి 845. దీన్నిబట్టి వినియోగదారుల చైతన్యం నామమాత్రంగానే ఉన్నట్టు అర్థమవుతున్నది. ఎక్కువమందికి అందుబాటులో ఉండే మాధ్యమం కాబట్టి టీవీలో ప్రకటనలివ్వటానికి, వాటిద్వారా వినియోగదారులను ఆకట్టుకోవటానికి సంస్థలు పెద్దమొత్తాల్లో ఖర్చు చేస్తూనే ఉంటా యి. ఆ క్రమంలో హద్దుమీరుతున్నప్పుడు ఫిర్యాదు చేయటం సమాజంలోని అందరి బాధ్యత. ఏదైనా ప్రకటన హద్దుమీరిందనో, అనైతికంగా ఉన్నదనో తేలినప్పుడు కేవలం ప్రకటనను ఉపసంహరించటం లాంటి శిక్షతో సరిపెట్టకుండా, ఆ సంస్థ ప్రకటనల మీద నిషేధం విధించటం లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అన్ని సంస్థలూ అప్రమత్తంగా ఉంటాయి. విద్య, వైద్య రంగాల ప్రకటనలలో తప్పుదారిపట్టించే ప్రకటనలు ఎక్కువగా ఉండటం సమాజానికి తీవ్ర ప్రమాదకరం.
-తోట భావనారాయణ