హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నె తెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. నూతన సచివాలయం అలంకృత రూపంతో అద్భుతంగా ఉండాలని చెప్పారు. పది కాలాలపాటు నిలిచి ఉండే సచివాలయాన్ని పటిష్టమైన రీతిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతంలో కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో ఉన్న పిల్లర్లను, బీమ్ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణం, సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్సాండ్ స్టోన్, బీజ్సాండ్ స్టోన్, నేచురల్ బీజ్, నేచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రగతిభవన్లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించేలా పలు రాష్ర్టాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉన్న తరహాలో ‘ధోల్ పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.